సూర్యాపేట, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : దళితుల్లో సామాజికంగా వెనుకబాటు తనాన్ని పోగొట్టి వారిని దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయడమే దళిత బంధు పథకం ఉద్దేశమని, ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఒక పథకం ప్రవేశ పెడితే దానినే బూచిగా చూపించి దశాబ్దాల తరబడి ఓట్లు అడిగేవారని, రాజకీయంగా లాభనష్టాలు చూసుకోకుండా పేదల అభ్యున్నతి కోసం పథకాలు ప్రవేశపెట్టే అభ్యుదయవాది, దేశంలోనే మానవీయ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ కాళేశ్వరంలాంటి మహా ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసిన తర్వాత దళితుల ఉద్ధరణ కోసం సీఎం కేసీఆర్ దళితబంధు స్కీంను చేపడుతున్నారని మంత్రి చెప్పారు.
గురువారం సూర్యాపేటలోని రవి కన్వెన్షన్ హాల్లో జిల్లా స్థాయి ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన దళిత బంధు అవగాహన సదస్సులో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్రావు, జిల్లాలోని శాసనసభ్యులు గాదరి కిశోర్కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళిత బంధు ద్వారా వారి జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టొచ్చని, దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని అన్నారు. తెలంగాణ దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ అని, తెలంగాణ సాధించుకున్నాక అన్ని వర్గాల ప్రజల అవసరాలను పరిగణలోకి తీసుకొని రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. లబ్ధిదారుల జీవితంలో దళిత బంధు గొప్ప సువర్ణ అవకాశమని, ఈ పథకం ద్వారా దళితులు జీవితంలో ఆర్థిక బలోపేతంతోపాటు విప్లవాత్మక మార్పు రావాలని పిలుపునిచ్చారు.
లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లపై పూర్తి స్థాయి అవగాహన కల్పించి యూనిట్ గ్రౌండింగ్ చేయిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజున ఎంపికైన లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం శుభ సూచకమని అన్నారు. దళిత బంధు పథకంపై మొదటిసారి సీఎం కేసీఆర్ మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశం సుమారు పది గంటలకుపైనే సాగిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న 18 లక్షల దళిత కుటుంబాలకు రూ.2లక్షల కోట్లతో అమలు చేసేందుకు వెనుకాడబోమని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సూర్యాపేట జిల్లాలో రెండు దఫాలుగా నాలుగు వేల ఒక్క వంద కుటుంబాలకు నియోజకవర్గాల వారీగా దళిత బందు పథకం అమలు చేస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతూ రాష్ర్టాన్ని దేశానికే రోల్ మోడల్గా నిలిపారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
దళితులు సమాజంలో తలెత్తుకొని గర్వంగా జీవించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ దళితబంధుతో ఇస్తున్న రూ.10 లక్షలతో వ్యాపారం చేసి ఆస్తులు సంపాదించి సీఎం ఆకాంక్షలను నెరవేర్చాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. దళిత జాతి ఉద్ధరణ కోసం వందశాతం ఉచితంగా రూ.10లక్షలు ఇస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆరేనని ఎమ్మెల్యే కిశోర్ అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎస్.మోహన్రావు, పాటిల్ హేమంత్కేశవ్, జడ్పీ సీఈఓ సురేశ్, డీఆర్డీఓ పీడీ కిరణ్కుమార్, జిల్లా ఉద్యాన అధికారి శ్రీధర్, వెంకటేశ్వర్లు, పరిశ్రమల జీఎం తిరుపతయ్య, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతోపాటు దళితులు పాల్గొన్నారు.