భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 17 : దేశంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సిన అవసరం ఉందని, దేశ ప్రజలంతా ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలంలోని చందుపట్లలో నిర్మించిన రైతు వేదికను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 2014కు మందు రాష్ట్ర ప్రజలు ఆకలి, దారిద్రంతో అల్లాడి పోయారన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఎనిమిదేండ్ల కాలంలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సీఎం కేసీఆర్ నిరంతరం నీళ్లు, ఉచిత విద్యుత్, రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తుండడంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందన్నారు.
తెలంగాణ పథకాలను ప్రశంసిస్తున్న ఇతర రాష్ర్టాలు
దేశంలో ఉన్న భూమికి సరిపడా నీళ్లు ఉన్నా సరైన ప్రణాళిక లేక పోవడంతో అన్ని ప్రాంతాలకు నీరందడం లేదన్నారు. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే 2 లక్షల మెగావాట్ల విద్యుత్ను మాత్రమే వాడుతున్నారని మరో రెండు లక్షల మెగావాట్లు వృథా అవుతుందన్నారు. అయినా దేశంలోనే చాలా గ్రామాల్లో నేటికీ కరెంటు లేదన్నారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. 200, 300 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతుబంధు ఎందుకిస్తున్నారంటూ కొందరు నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రాష్ట్రంలో 91 శాతం రైతులు 5 ఎకరాల లోపు వారేనని, 8శాతం 10 ఎకరాలు, 25 ఎకరాలకుపైగా ఉన్నవారు 0.1 శాతం మాత్రమే అని తెలిపారు.
గుంట భూమి ఉన్న రైతుకు కూడా రూ.5 లక్షల రైతు బీమా అందజేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుందన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రైతు వేదిక ఆవరణలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డితో కలసి పల్లా కేక్ కట్ చేసారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మండల కన్వీనర్ కంచి మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్గౌడ్, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, డీఏఓ అనూరాధ, టీఆర్ఎస్ మండలాధ్యక్ష, కార్యదర్శులు జనగాం పాండు, నీలం ఓంప్రకాశ్గౌడ్, నాయకులు, వెంకటేశ్వర్రావు, రాజిరెడ్డి, మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.