భువనగిరి అర్బన్, జనవరి 23: జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటా జ్వర సర్వే ఆదివారం మూడో రోజు కొనసాగింది. జిల్లాలో 757 బృందాలు సర్వేలో పాల్గొన్నాయి. ఉదయం నుంచి సాయం త్రం వరకు 30,490 ఇండ్లల్లో సర్వే నిర్వహించి జ్వరం, జలుబు, దగ్గుతో పాటు కరోనా లక్షణాలున్న 1,460 మందిని గుర్తించారు. వారికి మెడికల్ కిట్లను అందించారు. మొదటి రోజు 1365, రెండో రోజు 1726, మూడో రోజు 1460 మందికి మొత్తం 4,550 మందికి కిట్లను అందించారు. మూడు రోజుల్లో 88,251 ఇండ్లల్లో జ్వర సర్వే చేయగా 41.96 శాతంగా నమోదైంది. ఒక్కో బృందంలో ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది ఉన్నారు. ఒక్కో టీం 25 నుంచి 30 ఇండ్లల్లో సర్వే చేస్తూ.. జ్వర లక్షణాలున్న వారిని గుర్తిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి సాంబశివరావు తెలిపారు.
వలిగొండలో సర్వే
వలిగొండ : ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి ఆదివారం మండల వ్యాప్తంగా 2,100 ఇండ్లను సర్వే చేశారు. జ్వరం లక్షణాలతో బాధపడుతున్న 162 మందిని గుర్తించి మెడికల్ కిట్లు అందించారు. రెండు రోజుల్లో జ్వర తీవ్రత తగ్గక పోతే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్ష చేయించుకోవాలని మండల వైద్యాధికారి సుమన్కల్యాణ్ సూచించారు.
యాదగిరిగుట్ట మండలంలో..
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలంలోని అన్ని గ్రామాల్లో జ్వర సర్వే కొనసాగింది. ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలున్న వారిని గుర్తించి మందులు అందజేశారు.
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికి వెళ్లి జ్వర లక్షణాలున్న వారిని గుర్తించారు. కొవిడ్ లక్షణాలున్న వారికి మందుల కిట్ అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ తిర్మల్రెడ్డి, అంగన్వాడీ టీచర్లు స్వప్న, జగత్జ్యోతి, పంచాయతీ కార్యదర్శులు శేఖర్, నవీన్, ఆశ కార్యకర్తలు షాహీన్, వనజ పాల్గొన్నారు.