యాదాద్రి, జనవరి23 : యాదాద్రి శ్రీ లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దివ్యబాలాలయంలో ఆదివారం స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం వైభవంగా జరిపించారు. నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవ మూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. శ్రీ పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీవారి ఖజానాకు ఆదివారం రూ. 13,11,680 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.