యాదాద్రి భువనగిరి, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): కొత్త సొసైటీల ఏర్పాటు, సభ్యత్వం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మత్స్యకారులకు రాష్ట్ర సర్కారు తీపి కబురు అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటి వనరులపై సొసైటీల ఏర్పాటుతోపాటు మత్స్యకారులకు సభ్యత్వం ఇవ్వాలని భావించింది. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్తగా 30 సొసైటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతుండగా.. ఇప్పటికే 20 సంఘాల ప్రక్రియ పూర్తయింది. మరో 10 సొసైటీల కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే వీటికి రిజిస్ట్రేషన్ పూర్తికానుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 146 మత్స్యకారుల సొసైటీలు ఉండగా.. ఇందులో 10 మహిళా సొసైటీలు, 136 పురుషులవి ఉన్నాయి. వీటిల్లో 8,929 మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 161 పెద్ద చెరువులు, 1,043 చిన్న చెరువులు, మూసీ నది పరీవాహక ప్రాంతంలో మరో 20 చెరువులు ఉన్నాయి.
వృత్తి నైపుణ్య పరీక్షలు పూర్తి
కొత్తగా ఏర్పాటు కానున్న 30 మత్స్యకార సొసైటీల్లో సుమారు వెయ్యి మందికిపైగా సభ్యత్వం లభించే అవకాశం ఉంది. కొత్త సొసైటీల్లో సభ్యత్వం తీసుకునే మత్స్యకారులు చేపలు పడుతారా..? లేదా..? అన్నది తెలుసుకునేందుకు వృత్తి నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల్లో నెగ్గిన వారికే సొసైటీల్లో సభ్యత్వం ఇస్తారు.
ఇప్పటికే జిల్లాలో సొసైటీల ఏర్పాటుకు నైపుణ్య పరీక్షలు
నిర్వహించారు. జీఓ ఎంఎస్ 98లో గుర్తించిన 30 మత్స్యకార కులాలకు చెందిన వారు సొసైటీల్లో సభ్యత్వం పొందేందుకు అర్హులు. వారు మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తూ 18 ఏండ్లు వయస్సు నిండి ఉండాలి. కుల, స్థానికత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. జిల్లాలో అధికంగా గంగపుత్ర, ముదిరాజ్, బెస్త, గూళ్ల సామాజిక వర్గాలకు చెందిన వారే సొసైటీల్లో కొనసాగుతున్నారు. కొత్త సంఘాల్లోనూ వారికే అవకాశం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
మత్స్యకారులకు లబ్ధి
కొత్త సొసైటీల ఏర్పాటుతో మత్స్యకారులకు పలు విధాలుగా లాభం చేకూరనుంది. కుల వృత్తిదారులకు ఉపాధి దొరుకనుంది. సంఘంలో సభ్యత్వం రావడంతో సర్కారు బీమా సదుపాయం వర్తిస్తుంది. ప్రభుత్వ పథకాలు, ఇతర సబ్సిడీలు అందుతాయి. మత్స్యకారులు 60శాతం సబ్సిడీపై వాహనాలు పొందవచ్చు. మోటారు సైకిళ్లు, లగేజీ ఆటో, మొబైల్ ఔట్లెట్స్, ట్రాన్స్పోర్టు వెహికిల్స్, ట్రక్కులు సబ్సిడీపై తీసుకునే వెసులుబాటు ఉంది. ప్రమాద బీమా పథకం కింద ప్రమాదశాత్తు మరణించిన మత్య్సకారులకు రూ.6లక్షల ఎక్స్గ్రేషియా అందుతుంది.
ఇవీ నిబంధనలు..
ఒక చెరువు పరిధిలో తక్కువలో తక్కువ 11మంది సభ్యులతో మత్స్యకార పారిశ్రామిక సహకార సొసైటీ ఏర్పాటు చేయవచ్చు. కొత్త సొసైటీ ఏర్పాటు చేయాలంటే గ్రామంలో నీటి వనరు (చెరువు) విస్తీర్ణం 22 ఎకరాలు ఉండాలి. కాల్వ లేదా ఏడాది పొడవునా నీరుండే చెరువు అయితే కనీసం 11 ఎకరాల విస్తీర్ణం ఉండాలి. గ్రామంలో ఇప్పటికే ఏదైనా మత్స్య సొసైటీ ఉంటే ఆ సంఘం నుంచి విడదీస్తూ కొత్త సొసైటీ ఏర్పాటు చేసుకుంటున్నట్లు తీర్మానం చేయాలి.
30 సొసైటీల గుర్తింపు
జిల్లాలో కొత్తగా 30 సొసైటీలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించాం. ఇప్పటికే వృత్తి నైపుణ్య పరీక్షలు నిర్వహించాం. మిగతా ప్రక్రియ కొనసాగుతున్నది. త్వరలోనే పూర్తి స్థాయి రిజస్ట్రేషన్ పూర్తవుతుంది. సొసైటీలు, సభ్యత్వాలు రావడం వల్ల మత్స్యకారులకు పలు విధాలుగా మేలు జరుగుతుంది. బీమా, సబ్సిడీలు అందుతాయి.
– రాజారాం, జిల్లా మత్స్యశాఖ అధికారి