యాదాద్రి, ఏప్రిల్18: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి నేటి వరకు ఎంతో మందికి ఉపయోగం పోటీ పరీక్షలకు సిద్ధమై ఉద్యోగాలు సాధిస్తున్న యువతఆది చివరి నిజాం కాలం. తెలుగు భాషపై ఉర్దూ ఆధిపత్యం చలాయిస్తున్న సమయం. తెలుగు వారంతా తమ భాషను కాపాడుకోవాలని ప్రతినబూనారు. అప్పుడే ఆంధ్రమహాసభ, గ్రంథాలయోద్యమం ప్రజలకు అక్షరాస్యత వైపు ప్రేరేపించాయి. అందులో గ్రంథాలయోద్యమం కొలనుపాకపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుత ఆలేరు మండలంలోని కొలనుపాకతో పాటు రాజాపేట మండలంలోని బొందుగుల, రఘునాథపురం, యాదగిరిగుట్ట మండలంలోని చిన్నకందుకూరు గ్రామాలు అప్పటి నవాబ్ తురాబ్ యార జంగ్ జాగీర్ ఆధీనంలో ఉండేవి. అతను బహారామియా వంశస్థుడు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కొలనుపాకలో అతంత్య పురాతనమైన
గ్రంథాలయంపై కథనం.
ఆంధ్రమహాసభ, గ్రంథాలయోద్యమం, ఆంధ్రభాషా నిలయాల ప్రభావంతో బహారామియా గ్రంథాలయాన్ని బహారామియా ఆంధ్రభాషా నిలయంగా పిలిచేవారు. గ్రంథాలయానికి పక్కా భవనం నిర్మించాలని గ్రామానికి చెందిన ఆరుట్ల సోదరులతోపాటు బెల్లకొండ లింగయ్య నిర్ణయించారు. అదే సమయంలో ఆరుట్ల కమలాదేవి మెట్రిక్యులేషన్ పూర్తి చేసుకొని కొలనుపాకకు వచ్చారు. నూతనంగా నిర్మించబోయే భవనంలో గ్రంథాలయంతోపాటు బాలికల పాఠశాలనూ ఏర్పాటు చేయాలని ఆమె భావించారు. వెంటనే గ్రంథాలయ భవనం కోసం సహాయ సహకారాలు అందించాలని అని గ్రామాల్లో చాటింపు వేయించారు. దీనికి ప్రజలు స్వచ్ఛందంగా స్పందించారు. ఉదారంగా విరాళాలు అందించారు. ఇసుక, ఇటుకలు, మట్టి, దులాలు, పెంకులు సమకూర్చారు. కానీ గ్రంథాలయాలకు నిజాం ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. దాంతో రామానుజ కూటం పేరుతో అనుమతి తీసుకొన్నారు. 85 రోజుల్లోనే భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇక్కడే జూన్15, 1941న బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఇందులో 60 మంది బాలికలు చదువుకునేవారు. ఆ సయమంలోనే ఈ గ్రంథాలయానికి వెళ్లడం నేరమని, ఒకవేళ వెళ్తే తగిన శిక్ష ఉంటుందని నిజాం సర్కార్ ఆజ్ఞలు జారీ చేసింది. గ్రంథాలయంలోని వస్తువులు, పుస్తకాలను ఒక గదిలో ఉంచి, తాళం వేశారు. పోలీసులను కాపలా ఉంచారు. అయితే బహారామియా గ్రంథాలయం పునఃప్రారంభంపై కొంత అస్పష్టత ఉంది. 1945 మేలో తెరుచుకున్నదని కొందరు, హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో కలిసిన తర్వాత తెరుచుకున్నదని ఇంకొందరు చెబుతున్నారు.
1921 ఏప్రిల్ 6న ఏర్పాటు
కొలనుపాక గ్రామానికి చెందిన గంగరాజు కిషన్రావు, గంగరాజు రఘునాథరావు, మంగు నరసింహారావు హైదరాబాద్లో చదువుకునేవారు. వేసవి సెలవుల్లో కొలనుపాకకు వచ్చినప్పుడు ఇక్కడ పఠనాలయం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే 1921 ఏప్రిల్ 6వ తేదీన 62 పుస్తకాలతో ఒక చిన్న ఇంట్లో బహారామియా గ్రంథాలయం ప్రారంభమైంది. నవాబుతో ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో లైబ్రరీ పేరుకు ముందు బహారామియా అన్న మాట చేర్చారు. ఇందులో చిన్న చిన్న పుస్తకాలతోపాటు పలు పత్రికలు, కర పత్రాలు అందుబాటులో ఉంచేవారు. ఆ ముగ్గురితోపాటు మంగు శేషగిరిరావు కూడా గ్రంథాలయ అభ్యున్నతికి కృషి చేశారు. కొద్దికాలం తరువాత గ్రంథాలయాన్ని మాటూరి రామస్వామి మడిగలోకి మార్చారు. అప్పట్లోనే గోల్కొండ, ప్రజామిత్ర పత్రికల్లో వచ్చే వ్యాసాలపై చర్చలు జరిగేవి.
చరిత్ర పుస్తకాలు చదువుతా..
నా చిన్న నాటి నుంచి గ్రంథాలయం ఉంది. ప్రతి రోజూ చరిత్ర పుస్తకాలు చదువుతూ ఉంటాను. ప్రతి పుస్తకంలో చక్కటి సమాచారం ఉంటుంది. మారుమూల గ్రామమైన కొలనుపాకలో వందేండ్ల కిందటే గ్రంథాలయం నిర్మించారంటే గొప్ప విషయం. మాకు ఈ గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడుతున్నది.
-చిరబోయిన నరేశ్, కొలనుపాక
అందుబాటులో 6,900 పుస్తకాలు
వందేండ్లుగా ఇక్కడి ప్రాంత వాసులకు గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడుతున్నది. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఈ గ్రంథాలయం ఎంతో ఉపయోగపడిందని చెబుతున్నారు. చాలా మంది యువకులు ఈ గ్రంథాలయంలోనే చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. కొలనుపాక గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించారు. ప్రస్తుతం 6,900 పైగా పుస్తకాలు హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ నవలలు, పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కొలనుపాకతోపాటు కాకుండా చుట్టు పక్క గ్రామాలైన రాఘవపురం, రాజానగరం, బైరాంనగరం వాసులు సైతం గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటారు.
-ఆకుల ఆంజనేయులు, కొలనుపాక గ్రంథాలయం నిర్వాహకుడు