యాదాద్రి, నవంబర్ 18 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభూ నారసింహుడి నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల తిరువీధిసేవ, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. సుదర్శన నారసింహ హోమం పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. ఉదయం ఆలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ సుదర్శ నారసింహ హవనం చేశారు. వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల దివ్యమనోహరంగా అలంకరించి గజవాహన సేవ చేపట్టారు.
అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. కార్తిక మాసం సందర్భంగా కొండ కింద వ్రత మండపంలో సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 1,137 మంది దంపతులు వ్రత పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కార్తిక దీపారాధన పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సాయంత్రం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ కోలాహలంగా నిర్వహించారు. తిరువీధిసేవ అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలోని ఊయలలో శయనింపు చేసి లాలిపాటలు పాడారు. స్వామివారిని సుమారు 36వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.39,79,146 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
మస్కట్లో లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవం
ఒమాన్ దేశ రాజధాని మస్కట్లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. మస్కట్లోని కృష్ణాలయంలో స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ, ఆరాధన, అర్చనలు చేశారు. అనంతరం నవకలశ స్తపనం గావించారు. అనంతరం సుమారు 2గంటల పాటు స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం జరిపారు. ఆశీర్వచనం, ఆరగింపు, తీర్థ ప్రసాదాల గోష్టి చేపట్టి ఉత్సవాలకు ముగింపు పలికారు. ప్రతియేటా మస్కట్ లక్ష్మీనరసింహస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించే స్వామి, అమ్మవార్ల కల్యాణ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకల్లో ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహచార్యులు, అర్చకులు మంగళగిరి నర్సింహమూర్తి, సిద్ధార్థ, ఆలయ సూపరింటెండెంట్ సురేందర్రెడ్డి పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్రెడ్డి
శ్రీవారిని సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గురువారం రాత్రి యాదాద్రికి చేరుకున్న ఆయన ప్రెసిడెన్షియల్ సూట్లో బస చేశారు. అనంతరం శుక్రవారం ఉదయం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవ సేవ, నిత్య తిరుకల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక బృందం వేదాశీర్వచనం చేయగా, ఆలయ ఈఓ ఎన్.గీత స్వామివారి ప్రసాదం అందించారు.