రాజాపేట, సెప్టెంబర్ 20 : మండలంలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో బోర్లు, బావులు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భజలాలు పెరిగి బోర్లు, బావులు ఉప్పొంగుతున్నాయి. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్, సబ్సిడీ విత్తనాలు అందిస్తుండడం, రైతు బంధు పథకం అమలు చేస్తుడడంతో మండలంలో సాగు విస్తీర్ణం పెరిగింది.మండలంలో 23 గ్రామ పంచాయతీ ఉండగా 12 చెరువులు, 32 కుంటలు ఉన్నాయి. బోర్లు, బావులపైనే ఆధారపడి సాగు చేస్తుంటారు. పత్తికి అనుకూల వాతావరణం లేకపోవడంతో రైతులందరూ వరి సాగుకే మొగ్గు చూపారు. గతేడాది వానకాలంలో మండలంలో 9వేల ఎకరాల్లో వరి సాగు కాగా ఈ సారి 18 వేల ఎకరాల్లో వరి సాగైనట్టు వ్యవసాయాధికారులు తెలిపారు.
భూగర్భ జలాలు పెరిగాయి
ఎన్నో ఏండ్లుగా వర్షాలు లేక బీడు భూములుగా మిగిలిపోయాయి. ఎన్ని బోర్లు వేసిన నీటి చుక్క రాలేదు. మూడేండ్లుగా బాగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు కుంటల్లో నిండితున్నాయి. భూగర్భ జలాలు పెరిగి నాకు ఉన్న బావితో పాటు రెండు బోర్లు ఉప్పొంగుతున్నాయి. ఈ సారి నాకున్న ఐదు ఎకరాలు సాగులోకి రానుండడంతో ఎంతో ఆనందంగా ఉంది.
–రాసూరి నర్సయ్య, రైతు, రఘునాథపురం
క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం
మండలంలో భూగర్భ జలాలు పెరుగడంతో గతంలో కంటే ఈ సారి వరి సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో రైతులకు పంటల సస్య రక్షణపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తున్నాము. వాతావరణం అనుకూలంగా ఉండడంతో దిగుబడులు సైతం ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది
-మాధవి, ఏఓ, రాజాపేట