యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): వర్షాకాలంలో సాధారణంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. ముఖ్యంగా డెంగీ, మలేరియా, టైపాయిడ్ వంటివి ప్రబలుతుంటాయి. వీటిల్లో డెంగీ వ్యాధి మరింత ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయితే.. అన్ని జ్వరాలు డెంగీ జ్వరాలు అని చెప్పలేం. ఎడిస్ దోమ కాటు ద్వారా డెంగీ వ్యాపిస్తుంది. ఈ దోమలు ఇండ్లల్లోని, ఇంటి కృత్రిమ నీటి నిల్వ ఆవాసాల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఎడిస్ దోమలు పగటి వేళల్లో కుడుతాయి. దోమ కుట్టగానే శరీరంలో డెంగీ వైరస్ వ్యాప్తి చెందుతుంది. దాంతో డెంగీ జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటికే 15 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
రెండు, మూడు రోజుల్లో ఫీవర్ సర్వే..
జిల్లాలో రానున్న రెండు, మూడు రోజుల్లో ఫీవర్ సర్వే ప్రారంభించనున్నారు. అన్ని గ్రామాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి జ్వర సర్వే చేపట్టనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆశ కార్యకర్తులు, ఏఎన్ఎంలు, పీహెచ్సీ సిబ్బందితో కలిసి ఫీవర్ సర్వే చేయనున్నారు. వారం పాటు సర్వే కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సర్వేలో ఎలాంటి లక్షణాలు తేలినా వెంటనే వైద్యులు అలర్ట్ అవుతారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా డెంగీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. లక్షణాలు ఉన్నవారు నేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవచ్చు. జ్వరం వచ్చిన మొదటి రోజు నుంచి ఐదో రోజు వరకు ఎన్ఎస్1 ఎలీసా, ఆరో రోజు ఐజీఎం ఏసీ ఎలీస్ పరీక్షలను ఉచితంగా చేస్తారు.
డెంగీ లక్షణాలు..
అన్ని జ్వరాలు డెంగీ జ్వరాలు కావు.
రోగికి చలిగా అనిపిస్తుంటుంది.
జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి ఉంటుంది.
రోగి నీరసంగా ఉంటాడు.
ఆయాసం, కంటి కండరాల నొప్పి ఉంటుంది.
చర్మంపై దద్దుర్లు వస్తాయి.
వాంతులు, విరేచనాలు అవుతాయి.
పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది.
(తీవ్ర కేసుల్లో మాత్రమే)
మెదడు, ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుంది.
కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు.
లక్షణాలు కనిపిస్తే వెంటనే దవాఖానల్లో సంప్రదించాలి.
అన్ని శాఖల సమన్వయంతో ముందుకు..
డెంగీ నివారణలో వైద్య శాఖతోపాటు ఇతర శాఖలను కూడా సర్కారు భాగస్వామ్యం చేసింది. ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి పిలుపు మేరకు ఆదివారం ఆపరేషన్ క్లీన్ కార్యక్రమం కొనసాగుతున్నది. ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు ఇల్లు, పరిసరాలు శుభ్రం చేసుకునే కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇందులో విద్యార్థులు, టీచర్లు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయనున్నారు. వైద్య, ఆరోగ్య, మున్సిపల్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో ముందుకెళ్లనున్నాయి. గ్రామాల్లోపారిశుధ్య నిర్వహణపై చర్యలు తీసుకోనున్నారు. దోమలు లేకుండా ఫాగింగ్ చేయనున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి.
వారానికోసారి నీటి తొట్లు, ఇతర పాత్రలను శుభ్రంగా కడిగి, తుడిచి నీరు నింపుకోవాలి.
ఇంటి లోపల, బయట పనికిరాని చెత్త ఉండకుండా చూసుకోవాలి.
ఉదయం, సాయంత్రం 5నుంచి 6గంటల సమయంలో తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి.
దోమ తెరలను వాడాలి.
నీళ్ల ట్యాంకులు, డ్రమ్ములు, మంచి నీటి పాత్రలపై మూతలు ఉంచాలి.
డెంగీ నివారణకు ప్రత్యేక టీమ్..
డెంగీ నివారణకు జిల్లా అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా మలేరియా అధికారి, జిల్లా సహాయ మలేరియా అధికారి, ముగ్గురు సబ్ యూనియన్ ఆఫీసర్లు ఉన్నారు. వీరు ఎప్పటికప్పుడు జిల్లాలో డెంగీపై అలర్ట్ చేస్తుంటారు. కేసు నమోదైన వెంటనే సదరు గ్రామానికి చేరుకుంటారు. పాజిటివ్ వచ్చిన వారి ఇంటిని పూర్తిగా పరీక్షిస్తారు. కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇంట్లో పైరిత్రం స్ప్రే చేస్తారు. చుట్టుపక్కల సుమారు 50ఇండ్లల్లో ఉంటున్న వారికి కూడా డెంగీ పరీక్షలు చేస్తారు. ఏమైనా అనుమానాలు ఉంటే సీరంను హైదరాబాద్కు పంపిస్తారు.
అప్రమత్తంగా ఉండాలి..
ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జ్వరం బాగా వచ్చినవారు వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. రెండు రోజులకు మించి జ్వరం ఉంటే ఆలస్యం చేయకుండా దవాఖానకు వెళ్లాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవచ్చు. చికిత్స సమయంలో రోగులు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు లేకుండా చూసుకోవాలి.
– మల్లికార్జునరావు, డీఎంహెచ్ఓ , యాదాద్రి భువనగిరి జిల్లా