యాదాద్రి, సెప్టెంబర్ 5 : యాదాద్రి లక్ష్మీనర్సింహుడి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపం వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి.
రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం
యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్దినీ సమేత రామలింగేశ్వరస్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుతమైన అవకాశం ఉండటంతో భక్తులు పరమశివుడికి ప్రత్యేక పూజలు చేసి యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభాతవేళలో మొదటగా ప్రధాన శివాలయంలోని స్పటికలింగం, గర్భాలయంలో పరమశివున్ని కొలుస్తూ రుద్రాభిషేకంలో సుమారు గంటన్నర పాటు రుద్రాభిషేకంలో మమేకమయ్యారు. ఉదయాన్నే ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకించి స్పటిక లింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన పరమశివుడిని విభూతితో అలంకరించారు. ఆలయంలోని సుబ్రమణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలను అభిషేకించి అర్చన చేశారు. శివాలయం ప్రధాన పురోహితుడు గౌరీభట్ల నర్సింహరాములుశర్మ ఆధ్వర్యంలో శివుడికి అభిషేక, అష్టోత్తర పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.19,13,131 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
త్వరలో మరోసారి దర్శించుకుంటా
యాదాద్రీశుడిని త్వరలో మరోసారి దర్శించుకుంటానని సినీ నటి మంచు లక్ష్మి అన్నారు. సోమవారం ఆమె బీసీసీఐ మాజీ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ వంకిన చాముండేశ్వరనాథ్తో కలిసి యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం చేయగా, అలయాధికారులు స్వామివారి ప్రసాదం అందించారు. అనంతరం మాట్లాడుతూ నారసింహుడి దర్శనం ప్రశాంతంగా జరిగిందన్నారు. స్వామివారి దర్శనానికి మరోసారి యాదాద్రి రానున్నట్లు తెలిపారు. ఏపీ రాష్ట్ర ఐజీ నాగేంద్రకుమార్ కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.