భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 5 : డిజిటల్ విద్యతో విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలు పెంపొందుతాయని టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ చైర్పర్సన్, సినీ నటి మంచు లక్ష్మి సూచించారు. సోమవారం ఆమె మండలంలోని వడపర్తి ప్రాథమికోన్నత పాఠశాలకు ఆరు కంప్యూటర్లు బహూకరించారు. అనంతరం డిజిటల్ తరగతులను జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని వాటిల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ముందడుగు వేసిందన్నారు. జిల్లాలోని దత్తత తీసుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలిపారు.
జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి మాట్లాడుతూ టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పనకు పాటుపడటం సంతోషదాయకమన్నారు. విద్యార్థులు దాతల సహకారాలను అందిపుచ్చుకుని విద్యా ప్రమాణాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, గుణాత్మక విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదన్నారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా విని అర్థం చేసుకుని భవిష్యత్ను బంగారుమయం చేసుకోవాలని సూచించారు. గ్రామసర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్తివారీ, డీఈఓ కే.నారాయణరెడ్డి, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, ఎంపీడీఓ నరేందర్రెడ్డి, ఎంపీటీసీ ఉడుత శారద, ఎస్ఎంసీ చైర్మన్ ముడుగుల ఉషారమేశ్, హెచ్ఎం గుర్రం రాజు, ఉపాధ్యాయులు భీంరెడ్డి శైలజ, స్వరూప, ఉపేంద్ర రమేష్ పాల్గొన్నారు.