యాదాద్రి, ఆగస్టు 12 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నిత్యపూజల కోలాహలం నెలకొంది. తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి స్వామి వారి ఆర్జిత పూజలు మొదలయ్యాయి. సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన, నిజాషేకాలతో స్వామివారి నిత్యారాధనలు ప్రారంభించారు. లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి హారతి నివేదనలు అర్పించారు. సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపించారు. కల్యాణమూర్తులను ముస్తాబు చేసి ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతు జరిపించారు. అనంతరం నిర్వహించిన మొక్కు బ్రహ్మోత్సవ వేడుకల్లో భక్తులు పాల్గొన్నారు.
సాయంత్రం రాత్రి నివేదన, శయనోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ ఉభయ జోడుసేవలు, దర్బార్ సేవ నిర్వహించారు. సాయంత్రం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా నిర్వహించే సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. ప్రధానార్చకులు ఆధ్వర్యంలోని అర్చక బృందం వైభవంగా పూజలు చేశారు. ముత్తయిదువులు మంగళ హారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడి సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలోని ఊయలలో శయనింపు చేశారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలు కోలాహలంగా నిర్వహించారు. శ్రావణమాస వేడుకలు 15రోజుకు చేరాయి. స్వామివారి ప్రధానాలయం వెలుపలి ప్రాకారంలోని ఈశాన్య మండపంలో ‘శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన’ ఘనంగా కొనసాగుతున్నాయి. వివిధ విభాగాలను కలుపుకొని శ్రీవారి ఖజానాకు రూ. 13,46,194 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.