యాదాద్రి, జూలై 30 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన పూజలు ఆగమశాస్త్ర రీతిలో కొనసాగుతున్నాయి. శ్రావణమాసం రెండోరోజు శనివారం ప్రధానాలయ వెలుపలి ప్రాకారం ఈశాన్య మండపంలో మహాలక్ష్మి అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి కుంకుమార్చన పూజలను ప్రధానార్చక బృందం ఘనంగా నిర్వహించారు. అర్చనలో పాల్గొన్న భక్తులకు వారి గోత్రనామాల పేరిట సంకల్పం చేసి స్వామి వారి ప్రసాదం, శెల్లా, అమ్మవారికి కనుము, కుంకుమ ప్రసాదం అందించారు. ప్రాకారంలో 30మంది రుత్వికులు 3.60లక్షల లక్ష్మీ సహస్రనామార్చనను పఠించారు.
వైభవంగా సువర్ణ పుష్పార్చన
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో శ్రావణమాసం రెండోరోజు భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజామునే భక్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. క్యూకాంప్లెక్స్ గుండా యాదాద్రీశుడి సన్నిధికి చేరుకున్న భక్తులు స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్నారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన పూజలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి తిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాతం నుంచి సాయ ంత్రం శయనింపు సేవ వరకు భక్తులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేపట్టారు.
స్వామివారికి నిత్యపూజల కోలాహలం
స్వామి, అమ్మవార్లకు నిత్యపూజలు తెల్లవారుజామున 3.30గంటలకు ప్రారంభమయ్యాయి. తిరువారాధన, బాలబోగం, నిజాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు తులసీ సహస్రనామార్చనలు, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చనలు చేపట్టారు. ప్రధానాలయ లోపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణతంతు జరిపారు. సాయం త్రం అమ్మవారికి కుంకుమార్చన, స్వామి వారికి, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన, వెండి మొక్కు జోడు సేవలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. క్యూ కాంప్లెక్స్ చెంతన కొలువైన క్షేత్ర పాలక ఆంజనేయస్వామికి నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వయంభువులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపంలో సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాతగుట్టలో స్వామివారి నిత్యారాధనలు ఘనం గా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటకంగా కొనసాగాయి. స్వామివారిని 17వేల మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి ఖజానాకు రూ. 23,55,449 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఆండాళ్ అమ్మవారికి తిరునక్షత్రోత్సవాలు
శ్రావణమాసంలో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో మూడ్రోజుల పాటు సాగే ఆండాళ్ అమ్మవారి తిరునక్షత్రోత్సవాలకు అర్చకులు శనివారం శ్రీకారం చుట్టారు. మొదటిరోజులో భాగంగా ప్రధానాలయ ముఖమండపంలో ఆండాళ్ అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి తొళక్కం నిర్వహించారు. అమ్మవారి మహత్యాన్ని తెలిపే పాశురాలను ఆరుగురు రుత్వికులతో పఠించారు. అమ్మవారి మహత్యాన్ని మహావైభవంగా రుత్వికులు పారాయణం గావించారు. నేడు అమ్మవారికి ఉదయం నవకలాభిషేకం, తమిళ ప్రాశుర పఠనాలు, సాయంత్రం తిరువీధి సేవా ఉత్సవాలను నిర్వహిస్తామని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహచార్యులు తెలిపారు.