యాదాద్రి, జూలై 23 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో శనివారం నిత్యపూజల కోలాహలం నెలకొన్నది. ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. తిరువారాధన, బాలభోగం, స్వామివారికి నిజాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు తులసీ సహస్రనామార్చనలు, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. ప్రధానాలయం లోపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది. సుదర్శన నారసింహహోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణ తంతు జరిపారు.
సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, స్వామివారికి, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన, వెండి మొక్కు జోడు సేవలు జరిపించారు. స్వయంభువులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. కొండ కింద దీక్షాపరుల మండపంలో సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పాతగుట్టలో స్వామివారి నిత్యారాధనలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. స్వామివారిని 7వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు, శ్రీవారి ఖజానాకు రూ.8,88,011 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.