యాదాద్రి, జూలై 9 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి స్వయంభూ ప్రధానాలయంలో శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మి కోటి కుంకుమార్చన అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శ్రావణ శుద్ధ పాడ్యమి (ఈ నెల 29) నుంచి శ్రావణ బహుళ అమావాస్య (ఆగస్టు 27) వరకు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటలు, సాయంత్రం 4నుంచి 7గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులకు వారి గోత్ర నామాలతో సంకల్పం చేసి 30 రోజులపాటు పూజలు నిర్వహించి, శెల్లా, కనుము, కుంకుమ, లడ్డూ ప్రసాదం అందజేస్తారు. దంపతులకు ప్రవేశ రుసుం రూ.2వేలు ఉంటుంది. యాదాద్రి ప్రధానాలయ పునఃప్రారంభం అనంతరం మొట్టమొదటిసారిగా జరిగే కోటి కుంకుమార్చన ఉత్సవాలను అత్యంత వైభవంగా చేపట్టనున్నారు.
30 రోజులపాటు సాగే కుంకుమార్చన కార్యక్రమం మహిళా సౌభాగ్యం, లోకకల్యాణం, విశ్వశాంత్యార్థం, క్షేత్ర అభివృద్ధి, మహామంత్ర శక్తి సమర్పణం, యంత్రశక్తి ఉద్దీపనలు అనుసరించి నిర్వహించనున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య దేవాలయం పాంచరాత్ర ఆగమశాస్ర్తానికి ఒక గొప్ప ప్రయోగశాల. ఈ ప్రయోగశాలలో శాస్త్ర నియమ నిబంధనలను అనుసరించి ఎల్లప్పుడూ నవచైతన్యంతో నవ నారసింహస్వామి స్వరూపమైన పంచనారసింహస్వామికి వేదోక వైదృశ్య కార్యక్రమాలు 365 రోజుల్లో 225 రోజులు విశేషమైన పూజలు సాగుతూనే ఉంటాయి. యాదాద్రి ప్రధానాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఔదార్యంతో తెలంగాణ ప్రజల భాగ్యోదయ మహాభాగ్యంగా పునర్నిర్మించారు.
వెయ్యి కన్నులతో వెయ్యి సమాహారాలుగా వెయ్యి సంవత్సరాలు వర్థిల్లే విధంగా ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేసుకుని, స్వయంభూ పంచనారసింహుడి పునర్దర్శనం భక్తులకు కలిగిన అనంతరం రానున్న మొట్టమొదటి శ్రావణ మాసం ఇది. గత పునఃప్రతిష్ఠా మహోత్సవంలో ఆరు సంవత్సరాలలో స్వామివారికి సంవత్సరానికి ఒక కోటి చొప్పున నామాలను పూర్తి చేశారు. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా జరిగిన ప్రధానాలయ పునఃప్రతిష్ఠా మహోత్సవంలో కోటి నామాలు, మూలమంత్ర, మూర్తిమంత్ర జపాలు, హోమాలు, తర్పణాల పూర్తితో యాదాద్రీశుడికి శక్తి ఆపాదింపబడింది. ఆ శక్తితో నూతనోత్సాహంతో ఆలయం మంత్ర, యంత్ర, తంత్రముల ద్వారా ఏకోత్తమైన అభివృద్ధితో అక్షర సత్యంగా కనక వర్షం, దయామృత వర్షం కురుస్తున్నది. భక్తులందరూ ఆశ్చర్యచకితులై, పారవశ్యంగా నూతనాలయాన్ని దర్శించుకుని తరిస్తూ ఉన్నారు.
కోటి 8లక్షల లక్ష్మీ నామస్మరణ..
ప్రకృతైనటువంటి అమ్మవారు మహాలక్ష్మి స్వరూపం. భక్తుల కోరిక మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ ప్రధానార్చకుల ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారికి కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. కోటి కుంకుమార్చనతో అమ్మవారికి కోటి జపం పూర్తవుతుంది. భక్తులకు అభయ వరప్రధానం జరుగుతుంది. ప్రపంచ మహిళామణుల సౌభాగ్యమంతా స్థిరీకరణగా ఉండనుంది. ముఖ్యంగా ఆర్థిక, రుణ బాధలన్నీ తీరిపోతాయి. శ్రావణం అమ్మవారికి అభీష్టం, కార్యాకరణ కర్తిత్వమైనటువంటి మాసం కావడంతో ఈ నెల 29నుంచి ఆగస్టు 27వరకు కోటి కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపనున్నారు. ఈ మహాకార్యంలో 30 మంది రుత్వికులు పాల్గొని అమ్మవారి నామాన్ని రోజుకు 3.60 లక్షల సార్లు జపిస్తారు. ఇలా 30 రోజుల వరకు కోటి 8లక్షల నామస్మరణ పూర్తి చేయనున్నారు. కుంకుమార్చన కార్యక్రమాన్ని దీక్షితులైన అర్చకవర్యులు నియమ నిష్టలతో లోకకల్యాణార్థం చేపట్టనున్నారు.
పపంచ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ కోటి కుంకుమార్చన..
శ్రావణ లక్ష్మి కోటి కుంకుమార్చనలో పాల్గొనే భక్తులకు అమ్మవారి, స్వామివారి శేషవస్ర్తాలు, లడ్డూ ప్రసాదం అందజేయనున్నారు. ఒక్కరోజు కుంకుమార్చనలో పాల్గొనే భక్తులకు 30 రోజుల వరకు సంకల్పం చేయనున్నారు. కుంకుమార్చనలో పాల్గొనే దంపతులు రూ.2వేలు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ కోటి కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. కోటి కుంకుమార్చనతో అమ్మవారికి మంత్ర, యంత్ర, తంత్రశక్తి పెరిగి త్రిశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారికి అత్యద్భుతమైన మహాత్యం ఆపాదింపబడుతుంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో గొప్ప, నూతనమైన పూజలు జరుగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో శావణలక్ష్మి కోటి కుంకుమార్చన నిర్వహిస్తున్నారు. మోద ప్రమోద ఆనందాలతో భక్తులు పెద్ద సంఖ్యలో కుంకుమార్చనలో పాల్గొననున్నారు.
30 రోజులపాటు ఉత్సవాలు
శ్రావణ మాసాన్ని మహిళలు అతి పవిత్రంగా భావిస్తారు. వారి సౌభాగ్యం పెంపొందేందుకు ఈ మాసంలో లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారు. యాదాద్రి స్వయంభూ ప్రధానాలయ పునఃప్రారంభం అనంతరం మొదటిసారిగా మహాలక్ష్మి, ఆండాళ్ అమ్మవారికి కోటి కుంకుమార్చన అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 27 వరకు ఉదయం, సాయంత్రం కోటి కుంకుమార్చన జరుగుతుంది. దంపతులు మాత్రమే పాల్గొనే ఈ కార్యక్రమానికి రూ.2వేలు టికెటు నిశ్చయించాం. పాల్గొనే దంపతులకు వంద గ్రాముల స్వామివారి లడ్డూ, శేష వస్త్రంగా కల్యాణ శెల్లా, కనుము అందజేస్తాం. దంపతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
– ఎన్.గీత, యాదాద్రి ఆలయ ఈఓ
విశ్వశాంతి, క్షేత్రాభివృద్ధి
లోక కల్యాణం, విశ్వశాంతి, యాదాద్రి క్షేత్రాభివృద్ధి, మహామంత్ర శక్తి సమర్పణం, యంత్రశక్తి ఉద్దీపనలను అనుసరించి కోటి కుంకుమార్చన నిర్వహిస్తున్నాం. దీంతోపాటు క్షేత్ర విశిష్టత మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. ఈ మహాకార్యంలో 30 రోజుల పాటు 30 మంది రుత్వికులు ప్రతి రోజూ లక్ష్మీనామస్మరణ జపిస్తారు. 30 రోజుల వరకు నామస్మరణ చేపట్టి కోటి 8 లక్షల నామం పూర్తి చేస్తాం.
– నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, యాదాద్రి దేవస్థానం ప్రధానార్చకుడు