యాదాద్రి భువనగిరి, మార్చి 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాదాద్రి ప్రధానాలయం పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ నెల 21 నుంచి 28 వరకు నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ విజయవంతానికి అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తున్నది. అందులో భాగంగా యాదాద్రి ఆలయ అధికారులు, పోలీస్, రెవెన్యూ శాఖలతో కలెక్టర్ పమేలా సత్పతి గురువారం కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలిరానుండడంతో చేపట్టాల్సిన ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, మౌలిక వసతులపై చర్చించారు. ప్రముఖుల రాక సందర్భంగా పాటించాల్సిన ప్రొటోకాల్, బందోబస్తు తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. పంచ కుండాత్మక యాగం సందర్భంగా వారం రోజులపాటు నిర్వహించే పూజా కార్యకమాల షెడ్యూల్ను విడుదల చేశారు. మరోవైపు పునఃప్రారంభానికి సిద్ధంగా గర్భాలయంలో బంగారు తాపడం పనులు, రాజగోపురాలపై కలశ స్థాపన ఇప్పటికే పూర్తికాగా, తుదిదశలో ఉన్న క్యూ కాంప్లెక్స్ పనులు వేగంగా సాగుతున్నాయి.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహా కుంభ సంపోక్షణ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుముహూర్తం ప్రకారం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ ప్లవనామ సంవత్సర పాల్గుణ తదియ తేదీ.21.03.2022 స్వాతి నక్షత్ర యుక్త మేష లగ్నం నుంచి పాల్గుణ బహుళ ఏకాదశి శ్రణా నక్షత్ర యుక్త మిథున లగ్నం తేది.28.03.2022 వరకు పంచ కుండాత్మక మహాకుంభ సంప్రోక్షణ పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించనున్నారు. ఈనెల 28న ఉదయం 11.55 గంటల పుష్కరాంశ శుభ ముహూర్తాన నిర్వహించే మహాకుంభాభిషేకం అనంతరం స్వయంభువుల దర్శన భాగ్యం భక్తులకు కలుగనుంది.
పంచ కుండాత్మక యాగం
ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించే పంచ కుండాత్మక యాగంలో 108 పారాయణీకులతో పారాయణం, వేదపండితులతో వేద పారాయణం నిర్వహించనున్నారు. బాలాలయంలో నిర్వహించే యాగం సందర్భంగా నిత్య పూజలను ఈ కింద పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారు. ఉదయం పూట నిర్వహించే పూజలను రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు, సాయంత్రం పూజలను సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్నారు.
దారి పొడవునా స్వాగత తోరణాలు
యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం సందర్భంగా ఘన ఏర్పాట్లు చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు హైవేపై ప్రధాన ప్రాంతాల్లో స్వాగత తోరణాలు, ఆర్చిగేట్లు ఏర్పాటు చేయనున్నారు. సంప్రోక్షణ కార్యక్రమానికి సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు, ఉన్నతస్థాయి అధికారులు కూడా రానుండడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేపట్టనున్నారు. ప్రధానాలయాన్ని పూలతో అందంగా అలంకరించడంతోపాటు ఆలయ ప్రాంగణాలు, ముఖ్య దారుల్లో విద్యుత్తు అలంకరణలతో అందంగా ముస్తాబు చేయనున్నారు. సంప్రోక్షణ కార్యక్రమానికి వచ్చే పారాయణికులకు, స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో అన్నదాన కార్యక్రమాలను చేపట్టనున్నారు.
ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
ఈనెల 21 నుంచి 2 వరకు నిర్వహించే యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయ మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి గురువారం కలెక్టరేట్లో డీసీపీ నారాయణ రెడ్డి, యాదాద్రి ఆలయ ఈఓ గీత, భువనగిరి ఆర్డీఓ భూపాల్ రెడ్డి, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ ఏర్పాట్లు, ప్రముఖుల ప్రోటోకాల్ అమలు, భక్తులకు వసతుల ఏర్పాట్లు, బందోబస్తు, అగ్నిమాపక వ్యవస్థ, వైద్య శిబిరాలు, ఆర్టీసీ బస్సు సౌకర్యం, విద్యుత్ సరఫరా, వాహనాల పార్కింగ్ అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సమీక్షలో ట్రాన్స్కో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనాథ్, డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఆర్అండ్బీ ఎస్ఈ శంకరయ్య, జిల్లా ఫైర్ ఆఫీసర్ అజయ్ కృష్ణ, ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
21.03.2022(సోమవారం) :
ఉదయం : విశ్వక్సేన పూజతో స్వస్తివాచనం పలికి యాగానికి తెరతీస్తారు. పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాసన, రుత్విక్ వరుణం, అఖండ జ్యోతి ప్రజ్వలన, వాస్తు పూజలు నిర్వహిస్తారు.
సాయంత్రం : మృత్స్యగ్రహణం, అంకురార్పణం, యాగశాల ప్రవేశం, కుంభ స్థాపన
22.03.2022(మంగళవారం):
ఉదయం : శాంతిపాఠం, అవధారలు. యాగశాలలో చతుస్థానార్చన, ద్వార తోరణం, ధ్వజకుంభారాధనలు, అగ్నిమదనం, అగ్ని ప్రతిష్ట, యజ్ఞం ప్రారంభం, విశేష యజ్ఞ హవనం, మూలమంత్ర హవనం, నిత్యలఘు పూర్ణాహుతి.
సాయంత్రం : సామూహిక శ్రీ విష్ణుసహస్రనామ పారాయణం, నిత్యవిశేష హోమం, బింబ పరీక్ష, మన్నోమాన శాంతిహోమం, నవకలశ స్నపనం, నిత్యలఘు పూర్ణాహుతి.
23.03.2022(బుధవారం):
ఉదయం : యాగశాలలో శాంతిపాఠం, ద్వార తోరణం, ధ్వజకుంభారాధనలు, చతుఃస్థానార్చన, మూలమంత్ర హవనం, షోడషకలశాభిషేకం, నిత్యలఘు పూర్ణాహుతి.
సాయంత్రం: సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, యాగశాలలో ద్వార తోరణ ధ్వజకుంభ ఆరాధనలు, మూలమంత్ర హవనం, పంచగవ్యాదివాసం, నిత్యలఘు పూర్ణాహుతి.
24.03.2022(గురువారం) :
ఉదయం : శాంతి పాఠంతో ప్రారంభం. చతుఃస్థానార్చన, మూలమంత్ర హవనం, పంచవింశతికలస్నపానం, నిత్య లఘుపూర్ణాహుతి.
సాయంత్రం :సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, యాగశాలలో మూలమంత్ర హవనం, చతుఃస్థానర్చనలు, జలాదివాసం, నిత్యలఘు పూర్ణాహుతి.
25.03.2022(శుక్రవారం) :
ఉదయం : శాంతిపాఠం, చతుఃస్థానార్చన, మూలమంత్ర హవనం, ఏకోనసంచాషట్, కలశాభిషేకం, నిత్య లఘు పూర్ణాహుతి.
సాయంత్రం : సామూహిక శ్రీ విష్ణుసహస్రనామ పారాయణం, చతుఃస్థానార్చనలు, మూలమంత్రహవనం, పంచామృతాదివాసం, నిత్యలఘు పూర్ణాహుతి.
26.03.2022(శనివారం) :
ఉదయం :శాంతిపాఠం, చతుఃస్థానార్చన, ద్వార తోరణం, ధ్వజకుంభారాధన, మూలమంత్ర హవనం, ఏకాశీతికలశాభిషేకం, నిత్యలఘు పూర్ణాహుతి.
సాయంత్రం : సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం, చతుఃస్థానార్చనలు, ధ్యాన్యాదీవాసం, నిత్యలఘు పూర్ణాహుతి.
27.03.2022(ఆదివారం)
ఉదయం : శాంతిపాఠం, చతుఃస్థానార్చన, మూలమంత్రహవనం, అష్టోత్తర శతకలశాభిషేకం, నిత్యలఘు పూర్ణాహుతి.
సాయంత్రం : సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, మూలమంత్ర హవనం, చతుఃస్థానార్చనలు, షోడకళాన్యాసహోమం, పంచశయ్యదివాసం, నిత్యలఘు పూర్ణాహుతి.
(8)28.03.2022(సోమవారం):
ఉదయం : 7 గంటల నుంచి నిత్యహోమం, చతుఃస్థానార్చన, పరివార శాంతి ప్రాయశ్చిత్తహోమం, శాలబలి నిర్వహిస్తారు. 9 గంటలకు మహా పూర్ణాహుతి, కుంభ ఉద్వాసన, మిధునలగ్న పుష్కరాంశమున గర్తవ్యాసము, రత్న న్యాసము, యంత్ర ప్రతిష్ట, బింబ ప్రతిష్ట, అష్టబంధనం, కళారోహణం, ప్రాణ ప్రతిష్ట, నేతోన్మీలనం, దిష్టికుంభం నిర్వహిస్తారు. ఉదయం 11.55 గంటల మిథున లగ్న ముహూర్తాన మహాకుంభాభిషేకం, ప్రథమ ఆరాధన, ఆరగింపు తీర్థ, ప్రసాద గోష్టి కార్యక్రమాలు ఉంటాయి.
సాయంత్రం : 6 గంటలకు శాంతి కల్యాణం, ఆచార్య రుత్విక్ సన్మానం, మహాదాశీర్వచనంతో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు ముగుస్తాయి.