యాదాద్రి, మార్చి 17 : మరో పది రోజుల్లో యాదాద్రి ప్రధానాలయం పునః ప్రారంభం కానున్నడంతో కొండపైన పనులపై వైటీడీఏ, ఆలయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 21 మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ నేపథ్యంలో అందుకు కావాల్సిన పనులు తుది దశకు చేరుకున్నాయి.
బంగారు తాపడం పనులు
యాదాద్రీశుడి గర్భాలయ ముఖమండపం బంగారు వర్ణంతో మెరిసిపోనున్నది. ఇందుకోసం ప్రధానాలయంలోని స్వామివారికి, ద్వార, ధర్వాజలు, ధ్వజస్తంభ, బలిపీఠంతోపాటు జయవిజయుల ద్వారాల మధ్యలో బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి. ప్రధానాలయ ద్వారానికి 13 కిలోల బంగారం, ధ్వజస్తంభం, బలిపీఠానికి సుమారు 4 కిలోల బంగారంతో స్వర్ణ తాపడాలతో తీర్చిదిద్దారు. జయవిజయుల ద్వారాల మధ్యగల ప్రాంతంలో బంగారు తాపడం తుదిదశకు చేరుకున్నాయి.
శ్రీవారి మెట్లు
యాదాద్రీశుడిని కాలినడకన దర్శించుకునే భక్తులకు సకల సౌకర్యాలతో శ్రీవారి మెట్లను నిర్మిస్తుండగా దాదాపుగా పూర్తయ్యాయి. సువిశాలంగా మెట్ల నిర్మాణం, మధ్యలో సేద తీరేందుకు 2 విశ్రాంతి గదులను సైతం నిర్మించారు. కొండకింద గల స్వామి వారి వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి మొత్తం 335 శ్రీవారి మెట్లను నిర్మిస్తుండగా 315 మెట్లు పూర్తి చేయగా మిగతా 20 మెట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఒక్కో మెట్టు వెడల్పు 10 ఫీట్లు, పొడవు ఫీటు, మెట్ల ఎత్తు 6 ఇంచులతో నిర్మించారు.
క్యూ కాంప్లెక్స్
స్వయంభువులను దర్శించుకునే భక్తుల కోసం3 క్యూ కాంప్లెక్స్ను స్టీల్ రెయిలింగ్ నిర్మించారు. ఒక్కో కాంప్లెక్స్లో 600 మంది వేచి ఉం డొచ్చు. ఇక భక్తులకు స్నాక్స్, మంచినీళ్లు, అందించే ఏర్పాటు చేస్తున్నారు.
పంచ కుండాత్మక యాగం
మహా కుంభసంప్రోక్షణలో భాగంగా బాలాలయంలో నిర్వహించనున్న పంచ కుండాత్మక యాగానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. బాలాలయంలో 5 యాగశాలలను నిర్మిస్తున్నారు. చతురస్రం, అర్థవృత్తం, వృ త్తం, పద్మం, త్రికోణం రూపాల్లో యాగాలను తీర్చిదిద్దుతున్నారు. మధ్యలో స్వామివారి కవచమూర్తులను ప్రతిష్ఠించేందుకు ప్రత్యేకమైన వేదికను ఏర్పాటు చేస్తున్నారు.
గోపురాలపై కలశస్థాపన పూర్తి..
యాదాద్రి ఆలయంలో ఉన్న తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం పంచతల రాజగోపురాలు, పడమర సప్తతల రాజగోపురం, తూర్పు త్రితల రాజగోపురాలకు స్వర్ణ కలశ స్థాపన పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఒక్కో పంచతల రాజగోపురానికి 9 కలశాలు, సప్తతల రాజగోపురానికి 11 కలశాలను ప్రతిష్ఠించారు. ఇప్పటికే అష్టభుజి మండపాలను రాగి కలశ స్థాపన పూర్తికాగా వేంచేపు మండపం, బ్రహ్మోత్సవ మండపాలకు కలశస్థాపన పనులు సాగుతున్నాయి. స్వామివారి దివ్య విమానగోపురాన్ని బంగా రు తాపడంతో తీర్చిదిద్దేందుకు కావాల్సిన రాగి తోడుగుల పనులను తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురానికి చెందిన స్తపతి రవీంద్రన్ ఆధ్వర్యంలో చేపట్టగా పనులు తుదిదశకు చేరు కున్నాయి. స్వర్ణతాపడం పనులు చెన్నైలో జరుగుతున్నాయి.