ఆలేరు, మార్చి 8 : ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆలేరులోని దొంతిరి సోమిరెడ్డి గార్డెన్లో నియోజకవర్గ మహిళా సిబ్బందికి సన్మానం చేశారు. కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడుతూ మహిళలను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని తెలిపారు. సమాజ ఆరోగ్యం మహిళలతో ముడిపడి ఉన్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేస్తున్నారని తెలిపారు. ఫౌండర్ ఆఫ్ భూమిక ఉమెన్ కలెక్యూటివ్ కొండవీటి సత్యవతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కరోనా సమయంలో అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది సేవలు ఎనలేనివన్నారు. స్త్రీలు అన్ని విధాల ఎదుగాలని, హెల్ప్లైన్ నంబర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ నాగశ్రీ, ఆలేరు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మొరిగాడి మాధవి, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ సుధ, జడ్పీటీసీలు అనూరాధ, లక్ష్మి, ఎంపీపీలు నాగమణి, అమరావతి, ఇందిరా, సుశీల, నాయకులు సీస మహేశ్వరి, సుజాత, అనసూర్య, అరుణ, మమత, భారతమ్మ, శోభ, దాసి నాగలక్ష్మి, సునీత, లత, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.