భువనగిరి కలెక్టరేట్, మార్చి 2 : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కళాశాలల విద్యార్థుల పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలకు సంబంధించిన ప్రతిపాదనలు మూడు రోజుల్లో సమర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం ఆమె సమావేశమై మాట్లాడారు. 2020-21, 2021-22 సంవత్సరాలకు గాను జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి పోస్టు స్కాలర్షిప్ పూర్తి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఆధార్, అథెంటికేషన్ వేలిముద్రలు తదితర వివరాలు ఇంకా అందించని విద్యార్థుల నుంచి వెంటనే పొంది మూడు రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. సమీక్షా సమావేశంలో షెడ్యూల్ కులాల కార్పొరేషన్ అధికారి శ్యాంసుందర్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మంగ్తానాయక్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి యాదయ్య, మైనార్టీ సంక్షేమ శాఖాధికారి సత్యనారాయణ, కళాశాలల నోడల్ అధికారులు పాల్గొన్నారు.