భువనగిరి అర్బన్, మార్చి 1 : శివరాత్రిని పురస్కరించుకుని పట్టణంలోని పచ్చలకట్ట సోమేశ్వరాలయం, కన్యాకాపరమేశ్వరి ఆలయం, బహర్పేట్లోని దక్షిణ కాశీ ఆలయం, సాయిబాబా ఆలయం, తాజ్పూర్ గ్రామంలోని త్రిలింగేశ్వరాలయం, హన్మాపురంలోని మల్లికార్జున స్వామి ఆలయం, చందుపట్లలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, వడాయిగూడెం, అనంతారంలోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలు చేసుకున్నారు. పట్టణంలోని పచ్చలకట్ట సోమేశ్వరాలయంలో జరిగిన పార్వతీపరమేశ్వరుల కల్యాణానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి హాజరై పట్టువస్ర్తాలు అందజేశారు. అనంతరం శివాలయంలోని శివలింగానికి అభిషేకాలు చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, జడ్పీటీసీ బీరు మల్లయ్య, ఆలయ కమిటీ చైర్మన్ కాలేరు లక్ష్మణ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఏవీ కిరణ్కుమార్, మండలాధ్యక్షుడు జనగాం పాండు, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పచ్చలకట్ట సోమేశ్వరాలయంతోపాటు 10 శివాలయాలల్లో దర్శనాలకు వచ్చిన భక్తులకు వాసవీక్లబ్ ఆధ్వర్యంలో కర్జూర పండ్లు పంపిణీ చేశారు.
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంలోని రామలింగేశ్వరస్వామి, కొరటికల్లోని శంభులింగేశ్వరస్వామి, కఫ్రాయిపల్లిలోని శివ ఆంజనేయస్వామి, కూరెళ్లలోని సోమేశ్వర స్వామి, రహీంఖాన్పేటలోని మహాలింగేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు పూజలు చేశారు. కొరటికల్, రహీంఖాన్పేట ఆలయాల్లో మహాయజ్ఞం నిర్వహించారు. సర్పంచులు నగేశ్, ఉప్పలయ్య, సత్తయ్య, వరలక్ష్మి, వెంకటమ్మ, ఎంపీటీసీలు కవిత, వెంకటేశ్, ఆలయ కమిటీల చైర్మన్లు పాల్గొన్నారు.
రాజాపేట : మండల వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. చల్లూరు, కుర్రారం శివాలయాల్లో శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. సింగారంలో రాజరాజేశ్వరిస్వామి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో సర్పంచులు వంచ వీరారెడ్డి, కర్ల కరుణాకర్రెడ్డి, జూకంటి మమతాబాలస్వామి, ఉపసర్పంచ్ బింగి శ్రీను, భక్తులు పాల్గొన్నారు.
తుర్కపల్లి : మండల కేంద్రంతోపాటు వేల్పుపల్లి, దత్తాయిపల్లి, ఇబ్రహీంపురం, వాసాలమర్రి, మాదాపురంలో శివపార్వతుల కల్యాణం నిర్వహించారు.
ఆలేరు రూరల్ : కొలనుపాకలోని మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం రథోత్సవం నిర్వహించారు. గంగుల శ్రీనివాస్, చిర్రబోయిన జగతయ్య, సొంటెం రాజు, పూజారి భూమయ్య పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్ : మండల వ్యాప్తంగా ప్రజలు ఉదయం నుంచే పూజలు చేశారు. భక్తులు శివలింగాన్ని దర్శించుకొని పాలాభిషేకం చేశారు. మల్లాపురంలో శివపార్వతుల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.
బీబీనగర్ : మండలంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహదేవ్పూర్లో ఉమామహేశ్వర స్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ సుధాకర్గౌడ్ అన్నదానం చేశారు. ఎస్ఐ రాఘవేందర్గౌడ్ పూజలు చేశారు. సర్పంచులు దేవరకొండ వేణుగోపాల్, మొరిగాడి బాలమల్లేశ్, అరిగె సుదర్శన్, రమేశ్యాదవ్, పంజాల సతీశ్గౌడ్, పంజాల రమేశ్గౌడ్, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : మున్సిపాలిటీ వ్యాప్తంగా మహాశివరాత్రిని ఘనంగా జరుపుకొన్నారు. భక్తులు శివాలయాల వద్ద బారులు దీరారు. శివలింగానికి అభిషేకం చేశారు. అన్ని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి.
రామన్నపేట : మండల వ్యాప్తంగా వేడుకలు జరిగాయి. శివలింగాలకు పంచామృతాలతో అభిషేకాలు చేసి పూలతో అలంకరించారు. భక్తులు సాయంత్రం శివాలయాల్లో పూజలు చేసి దీక్షలు విరమించారు.
మోటకొండూర్ : మండల వ్యాప్తంగా వేడుకలు జరిపారు. చాడ గ్రామంలోని భీమలింగేశ్వర స్వామి కల్యాణం, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచే శివాలయాలకు వెళ్లి అభిషేకాలు చేశారు.
గుండాల : మండలంలోని అన్ని గ్రామాల్లో శివరాత్రి వేడుకలను వైభవంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచే భక్తుల కోలాహలం ప్రారంభమైంది. అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేసి శివయ్యను వేడుకున్నారు.
బొమ్మలరామారం : మండల కేంద్రంతోపాటు మైలారం, నాగినేనిపల్లి, చీకటిమామిడి, రామలింగంపల్లి, ప్యారారం గ్రామాల్లోని శివాలయాల్లో శివరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి, వైస్ ఎంపీపీ గొడుగు శోభ, సర్పంచులు మేడబోయిన గణేశ్, సుర్వి గోవింద్ గౌడ్, వడ్లకొండ అరుణ, భట్కీర్ బీరప్ప, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్ గౌడ్ పాల్గొన్నారు.
వలిగొండ : మండల వ్యాప్తంగా శివాలయాల్లో శివపార్వతుల కల్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. కంచనపల్లిలోని విశ్వేశ్వరస్వామి ఆలయం, వెంకటాపురం రామలింగేశ్వర స్వామి ఆలయం, పొద్దుటూరు రామలింగేశ్వరస్వామి ఆలయం, పులిగిల్ల రామలింగేశ్వర స్వామి ఆలయం, సంగెం భీమేశ్వరస్వామి ఆలయం, రెడ్లరేపాక భవానీ శంకర్ స్వామి ఆలయం, వలిగొండ ఉమా మహేశ్వరస్వామి ఆలయం, ఎం.తుర్కపల్లి రామలింగేశ్వర స్వామి ఆలయం, సుంకిశాల శివాలయం, త్రిశక్తి ఆలయాలకు భక్తులు పోటెత్తి పూజలు చేశారు. కంచనపల్లి కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చందుపట్ల వెంకటేశ్వర్రావు స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అలాగే వలిగొండ మండల కేంద్రంలోని పర్వతగిరిపై కొలువైన ముక్కోటి శివలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అభిషేకాలు, పూజలు చేశారు.
బీబీనగర్(భూదాన్పోచంపల్లి) : పట్టణంలోని మార్కండేశ్వర స్వామి ఆలయంలో మార్కండేశ్వర భజన మండలి ఆధ్వర్యంలో సామూహిక వ్రతాలు నిర్వహించారు. కౌన్సిలర్ మోటె రజితారాజు పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బడుగు చండికేశ్వర్, మార్కండేయ భజన మండలి అధ్యక్షుడు భోగ నర్సింహ, ప్రతినిధులు భోగ చంద్రశేఖర్, రుద్ర బాలరాజు పాల్గొన్నారు.
మోత్కూరు : మున్సిపాలిటీ కేంద్రంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలు చేశారు. పాలడుగు, దాచారం, పొడిచేడు, సదర్శాపురం, ముశిపట్లలోని ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ముశిపట్లలో బుగ్గ రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని రాత్రి జరిపించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు గుండగోని రామచంద్రుగౌడ్, బయ్యని రాజు, బీసు యాదగిరి, లోడె యాదగిరి పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం : మండల కేంద్రంలోని ఉమా మహేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా జరిపించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు వీరమల్ల కేశవులు, గోపాల్రెడ్డి, గిరి, యాదయ్య, వెంకన్న, జనార్దన్రెడ్డి, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అడ్డగూడూరు : మండల కేంద్రంతోపాటు లక్ష్మీదేవికాల్వ, చిర్రగూడూరు, డి.రేపాక, కంచనపల్లిలో పూజలు చేశారు. శివుడికి ఇష్టమైన మోదుగు పువ్వు, మారేడు పత్రి, వివిధ రకాల పండ్లను సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నారబోయిన వెంకటేశం, పురోహితులు, భక్తులు పాల్గొన్నారు.