రాజాపేట, ఫిబ్రవరి 28 : మహాశివరాత్రి వేడుకలకు మండలంలోని చల్లూరు, సింగారం, కుర్రారం, బొందుగుల గ్రామాల్లోని శివాలయాలు ముస్తాబయ్యాయి. ఉత్సవాలను పురష్కరించుకొని ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. ముఖ్యంగా రేణికుంట మల్లన్నగుట్టలో మల్లికార్జునస్వామి, చల్లూరు, కుర్రారం శివాలయల్లో శివపార్వతుల కల్యాణం నిర్వహించనున్నారు. అదేవిధంగా సింగారంలో రాజరాజేశ్వరి కల్యాణాన్ని వైభవంగా జరిపిస్తారు.
చల్లూరులో కొనసాగిన ఉత్సవాలు
రాజాపేట : మండలంలోని చల్లూరులో శివశంకరపార్వతి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు సోమవారం రెండో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా పండితుడు కృష్ణ అవధాని ఆధ్వర్యంలో హోమం, స్థాపిత దేవత పూజ, మూల మూర్తులకు అభిషేకం, మంత్రపుష్పం, అభిషేక హారతి నిర్వహించారు. సర్పంచ్ వంచ వీరారెడ్డి, ఉపసర్పంచ్ బింగి శ్రీను, మహేశ్వరం సిద్ధులు, వెంకటాచారి, అరుణ, మహేశ్వరి, ఆండాలు, చంద్రకళ, భవాని, భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా శివపార్వతుల కల్యాణం
మోటకొండూర్ : మహాశివరాత్రిని పురస్కరించుకుని ముందస్తుగా మండల కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు శివపార్వతులకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.