యాదాద్రి, మార్చి 1: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ శివాలయంలో మంగళవారం రాత్రి నిత్య పారాయణాల అనంతరం లింగోద్భవ కాలమున పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం శివాలయంలో వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములతో నిత్యహవనములు, శివ పంచాక్షరీ జపములు, నందీశ్వర పారాయణాలు, పంచసూక్త పఠనం గావించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశికధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ ఎన్.గీత, శివాలయ ప్రధానార్చకుడు నరసింహరాములు శర్మ, ప్రధాన పురోహితుడు గౌరీభట్ల సత్యనారాయణ శర్మ, అర్చకులు పాలకుర్తి నర్సింహమూర్తి, శ్రీనివాసశర్మ, నందిభట్ల సాయికృష్ణ శర్మ, పురోహితులు నాగరాజు శర్మ, అధికారులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
శత రుద్రాభిషేకం విశిష్టత..
మాఘమాసంలో పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన అభిషేక మహోత్సవం నిర్వహిస్తే సకల అపమృత్యు దోషాలు తొలగి అపూర్వమైన విజ్ఞానంతోపాటు అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగునని శివపురాణంలో పేర్కొన్నారు. వేదములలోని రుద్రాధ్యాయంలో రుద్రాభిషేకం నిర్వహిస్తే శాశ్వత కైవల్య ప్రాప్తి కలుగునని ఈ రుద్రాభిషేక వైభవం సూచిస్తున్నది. పరమ పవిత్రమైన విష్ణు పొదోద్భవియైన గంగను శిరస్సున దాల్చిన పరమశివుడు తనలోని తమోగుణం నిర్మూలన గావించేందుకు శ్రీమన్నారాయణుడిని ప్రార్థించగా పరమ పవిత్రమైన గంగాజలంతో నిరంతర అభిషేక మహోత్సవం జరిగిన యెడల సత్వగుణం ప్రకాశించి తమోగుణ ప్రభావం తగ్గునని, తద్వారా లోకములకు జ్ఞాన ప్రకాశకుడవు కాగలవని చప్పబడెను. అందుకే శృతులు, స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు శంకరాత్ జ్ఞానమన్విచ్చేత్ అని స్తుతించారు. ఈ వేడుకలతో మనలోని తామసిక గుణం తగ్గి శుద్ధ సత్వప్రకాశకమైన సత్వగుణం పెంపొందగలదని ఈ వేడుకను నిర్వహిస్తారు.
ఆర్జిత పూజల కోలాహలం..
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో ఆర్జిత పూజల కోలాహలం నెలకొన్నది. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్యపూజల్లో భాగంగా మొదటగా స్వామివారి బాలాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, లక్ష్మీనరసింహుల నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఆలయ మహామండపంలో అష్టోత్తరం జరిపించారు. సాయంత్రం అలంకార జోడు సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. స్వామి సన్నిధిలో క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ పర్వాలు శాస్ర్తోక్తంగా జరిగాయి. కొండపైన భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే గల విష్ణుపుష్కరిణి చెంత పాతగుట్ట ఆలయంలో కొలువుదీరిన క్షేత్రపాలకుడిని కొలుస్తూ అర్చకులు పంచసూక్తాలు, మన్యుసూక్త పఠనాలతో అభిషేకించారు. వేదమంత్ర పఠనాలతో ఆంజనేయ స్వామిని సింధూరం, వివిధ రకాల పూలతో అలంకరించారు. తమలపాకులతో అర్చించి ఆంజనేయుడి సహస్రనామ పఠనాలతో నాగవల్లి దళార్చనలు నిర్వహించారు. లలితా పారాయణం చేసి స్వామివారికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. శ్రీవారి ఖజానాకు మంగళవారం రూ.7,27,252 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.