HomeNalgondaYadadri Devotees Flocked To Yadadri Devotees Who Celebrated The Wedding
Yadadri : యాదాద్రిలో పోటెత్తిన భక్తజనం.. కల్యాణవేడుకను తిలకించిన భక్తులు
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో స్వామివారి ప్రాంగణం రద్దీగా మారింది. స్వామివారి ఆలయ పురవీధులు, లడ్డూప్రసాద విక్రయశాల, క్యూలైన్లు భక్తులతో నిండిపోయింది. స్వామివారి వీఐపీ దర్శనానికి రెండు గంటలు, ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని భక్తులు తెలిపారు. ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము నాలుగు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో స్వామివారికి ఆరాధనలు ప్రారంభించారు.
సుప్రభాతంతో స్వామివారి మేల్కొపిన అర్చకులు లక్ష్మీసమేత నారసిండిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేపట్టారు. హారతి నివేదనలతో అర్చించి, శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతీ రోజు నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరునికి రుద్రాభిషేకం జరిపారు. నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు.