యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సాధికారత.. సమానత్వం దిశగా ఉమ్మడి జిల్లాలో అడుగులు పడుతున్నాయి. ఆడ, మగ పిల్లల్లో ఎవరైతే ఏంటనే భావన కన్నవాళ్లలో పాతుకుపోతుండగా.. దీనినే నిజం చేస్తూ ఆడపిల్లల నిష్పత్తి క్రమంగా పెరుగుతున్నది. రెండు కాన్పుల్లో ఒకరు తప్పక అమ్మాయే ఉండాలన్న కోరిక తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. ఇదే క్రమంలో అమ్మాయిలు సైతం తమ నైపుణ్య పరిధిని విశాలం చేసుకుంటూ ఉన్నతంగా ఎదుగుతున్నారు. తమకంటూ గుర్తింపు కోసం అహర్నిశలు కృషి చేస్తూ..గర్వించదగ్గ విజయాలను కైవసం చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన ధాత్రిరెడ్డి అత్యున్నత హోదా అయిన ఐఏఎస్కు ఎంపిక కాగా..భువనగిరికి చెందిన అన్వితారెడ్డి అతి ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. తాజాగా.. బీబీనగర్ సాంఘిక సంక్షేమ మహిళా సాయుధ దళాల శిక్షణ కళాశాలకు చెందిన విద్యార్థిని చాముండేశ్వరి వైమానిక యానంలో అత్యున్నత హోదా కలిగిన ఉద్యోగాన్ని సాధించింది. ఇలా చెప్పుకుంటూ పోతే.. జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన వారు ఎందరో ఉన్నారు. వీరి స్ఫూర్తి.. రేపటి ఆశతో ముందడుగు వేసే బాలికలెందరికో ఆదర్శంగా నిలుస్తుండగా.. సమాజంలో వచ్చిన ఈ మార్పులు ‘బంగారు తల్లుల’ భవిష్యత్కు భరోసా కలిగిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న మహిళల నిష్పత్తి
కేంద్ర గణాంక శాఖ ఇటీవల ‘విమెన్ అండ్ ఇన్ ఇండి యా-2020’ నివేదికను వెల్లడించింది. 2019 సంవత్సరంలో నిర్వహించిన జాతీయ, ఆరోగ్య కుటుంబ సర్వే ఆధారంగా ఈ నివేదికను కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది. ఈ నివేదిక అనుసరించి గతంతో పోలిస్తే లింగ నిష్పత్తి స్వల్పంగా పెరిగింది. 2011 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 943 మంది మహిళలే ఉంటే.. ప్రస్తుతం 948కి పెరిగింది. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాత్రం లింగ నిష్పత్తిలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. 2015-16 సంవత్సరంలో నిర్వహించిన సర్వేలో గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మంది పురుషులకు 960 మంది స్త్రీలు, పట్టణాల్లో 988 మంది మహిళలు ఉన్నారు. తాజా.. నివేదిక ప్రకారం మాత్రం నల్లగొండ జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 1,071 మంది మహిళలు, సూర్యాపేట జిల్లాలో 1,015 మంది మహిళలు ఉండగా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం రెండు జిల్లాల కంటే అధికంగా 1,071 మంది మహిళలు ఉన్నట్లు కేంద్ర గణాంక శాఖ వెల్లడించిన నివేదిక స్పష్టం చేస్తోంది.
ఆడ, మగ ఇద్దరూ సమానమనే భావన
నేటి సమాజంలో ఆడబిడ్డకు ఆదరణ పెరుగుతోంది. మగ బిడ్డపై ఉన్న మోజుతో ఆడపిల్లను సాకడం కష్టమన్న భావన నిన్నమొన్నటి వరకు ఉండగా.. అది ఇప్పుడు క్రమక్రమేణా కనుమరుగైపోతోంది. ఆడ, మగ ఇద్దరు సమానమనే భావన తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. ఫలితంగా.. ఆడ పిల్ల పుడితే అయ్యో అనుకునే పరిస్థితులు పోయి.. మహాలక్ష్మిగా భావించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు ఆడపిల్లల రక్షణకు అనేక కార్యక్రమాలు అమలుపర్చి చైతన్యం తెస్తుండడంతో తల్లిదండ్రుల్లోనూ మార్పు కనిపిస్తోంది. బాలికలకు ఆదరణ పెరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇతోధికంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. గతంతో పోలిస్తే వైద్య వసతులు మెరుగుపడ్డాయి. పుట్టిన బిడ్డపై పర్యవేక్షణ కూడా పెరిగింది. అంగన్వాడీ, వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి గర్భిణుల వివరాలు సేకరించి వైద్య సదుపాయాలు కల్పిస్తుండడంతో మాతా, శిశు మరణాలు సైతం తగ్గాయి.
కేంద్ర ప్రభుత్వం ‘భేటీ బచావో.. బేటీ పడావో’ పథకాన్ని అమలుపరుస్తుండగా.. తెలంగాణ ప్రభుత్వం బాలికల సంరక్షణ, వాళ్ల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల తదితర అంశాలపై అనేక కార్యక్రమాలను చేపడుతోంది. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల ద్వారా అందిస్తున్న సాయం.. ఆడపిల్లలు భారం అనుకున్న తల్లిదండ్రుల్లో కొండంత భరోసాను నింపుతోం ది. వీటి మూలంగా.. పట్టణాల కంటే పల్లెల్లోనే గణనీయమైన మార్పులు వచ్చి ఆడపిల్లలపై కన్నవాళ్ల ఆదరణ పెరుగుతూ వస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. బాలికలను స్వశక్తిమంతులుగా తీర్చిదిద్దడంలో భాగంగా వారిని చదివించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ఉన్నత చదువులు చదివించేందుకు వెనుకాడిన తల్లిదండ్రులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన గురుకులాలకు ఆడపిల్లలను పంపి ఉన్నత చదువులను సైతం చదివిస్తున్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలకు చెక్ పడితేనే..
గిరిజన తండాల్లో ఆడపిల్లలపై ఉన్న వివక్ష కారణంగా పురిట్లోనే ఆడపిల్లలను చంపేయడమో.. లేక అమ్మేయడమో వంటి అనాగరిక చర్యలు గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా సాగేవి. అయితే వారిలో వచ్చిన చైతన్యం మూలంగా ఆ తరహా చర్యలు ఇప్పుడు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. అయితే అన్నిరకాలుగా అభివృద్ధి సాధిస్తున్న ప్రాంతాల్లో.. చదువుకున్న వారు సైతం కడుపులోనే పిండాన్ని చిదిమేస్తుండడం వంటి చర్యలకు పాల్పతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో వందల కొలదీ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు ఉండగా..కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే మరణశాసనం లిఖిస్తున్నారు. లింగనిర్ధారణ చేసే ఫ్రీ కాన్సెప్షనల్ ఫ్రీనాటల్ డయోగ్నస్టిక్ టెస్ట్(పీసీ పీఎన్డీటీ)ను నిషేధిస్తూ ప్రభుత్వం 1994లో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ నేటికీ గుట్టుచప్పుడు కాకుండా పరీక్షలు చేస్తూ భ్రూణ హత్యలకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లా జనాభాలో బాలికల నిష్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది. కొన్ని వర్గాల్లో వివాహానికి ఆడపిల్లలు దొరక్క ఇబ్బంది పడుతున్న పరిస్థితులు సైతం నేడు కనిపిస్తున్నాయి. అయితే కాలక్రమేణా.. వచ్చిన మార్పుతో ఏడాదికేడాది మహిళల నిష్పత్తి పెరుగుతూ వస్తుండడం కొంత వరకు శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో..స్కానింగ్ సెంటర్లపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ పెడితే స్త్రీ, పురుష నిష్పత్తిలో అంతరం మరింతగా తగ్గనుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇవీ కూడా చదవండి…
యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్యం
గురుతర బాధ్యతగా సమాజ చైతన్యంలో