యాదాద్రి, భువనగిరి టౌన్, మే10: కొవిడ్ సెకండ్ వేవ్ ఊపందుకున్న నేపథ్యంలో కరోనా కట్టిడికి ప్రభుత్వం చేపట్టిన జర్వ పీడితుల గుర్తింపు సర్వే జిల్లా వ్యాప్తంగా సోమవారం ముగిసింది. ఐదు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యులకు వైరస్ కట్టిడిపై అవగాహన కల్పించారు. ఎవరికైనా కొవిడ్ లక్షణాలు ఉంటే వైద్య సిబ్బంది పరీక్షలు చేసి, అక్కడికక్కడే మెడిసిన్ కిట్ అందజేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 7,96,000 మంది ప్రజలకు భరోసా లభించింది.
ముందస్తుగా మందుల పంపిణీ
కరోనా కట్టిడికి ప్రభుత్వం ప్రజలకు ముందుస్తుగా ముం దులు పంపిణీ చేసింది. ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా ఐదురోజులు 2,06,290 కుటుంబాలను కలిసి ఆరోగ్య సమాచారాన్ని సేకరించారు.కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి మందులు అందజేశారు. జిల్లా వ్యాప్తం గా 4,633 మందుల కిట్లు పంపిణీ చేశారు.ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్తో పాటు వెంటిలేటర్, ఐసీ యూ.. ఇలా అన్ని వసతులు ఉన్నాయని ప్రజలకు వివరించి వారిలో మనోధైర్యాన్ని కల్పించారు.
ప్రజలకు వివరించిన అంశాలివే…
కొవిడ్ లక్షణాలపై గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తున్న బృందాలు ప్రజలకు అవగాహన కల్పించాయి. రోగనిరోధన శక్తి పెంచుకునేందుకు తాజా కూరగాయలు, పండ్లు తినాలి. ప్రభుత్వం అందజేసే మందులు చాలా సురక్షితమైనవని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారు 10 రోజులపాటు అన్ని జాగ్రత్తలు పాటించాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి. మానసిక ఆందోళనలకు గురికాకూడదు. మాస్కు వాడాలి. బయటకు వెళ్తే భౌతిక దూరం పాటించాలి. చేతులను తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. గోరు వెచ్చని ఉప్పు నీటితో రోజుకు నాలుగుసార్లు పుక్కిలించి ఉమ్మివేయాలి. మరిగే నీటిలో జిందా తిలిస్మాత్ నాలుగు చుక్కలు వేసి ఆవిరిపట్టాలి. ఆక్సిజన్ లెవల్స్ 93 కన్నా తక్కువ ఉంటే ఏఎన్ఎం, ఆశ వర్కర్ను సంప్రదించాలి. అవసరమైతే 108 కుఫోన్ చేసి దవాఖానలో చేరవచ్చు.
జ్వర సర్వేకు సహకరించాలి
రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేకు మండల ప్రజలంతా సహకరించాలని మండల వైద్యాధికారి రాజేందర్నాయక్ కోరారు. సోమవారం మండలంలోని ఆయా గ్రామాల్లో గ్రామపంచాయతీ అధికారులు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు ఇంటింటికీ జ్వర సర్వేను ముమ్మరంగా చేపట్టారు. మండల వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
గుట్ట మండలంలో ముగిసిన సర్వే
జ్వరం, జలుబు తదితర కొవిడ్ లక్షణాలు ఉన్న వారిని ఇంటి దగ్గరే గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే మండలంలో ముగిసినట్లు ఎంపీడీవో కారం ప్రభాకర్రెడ్డి సోమవారం తెలిపారు. మండలంలోని మొత్తం 23 గ్రామాల్లో 8140 ఇండ్లల్లో సర్వే చేసినట్లు తెలిపారు. ఇందులో జ్వరం తదితర సమస్యలతో ఉన్న 454 మందిని గుర్తించి, వారికి వైద్యశాఖ నుంచి అవసరమైన మందులు అందజేసినట్లు తెలిపారు.
సర్వేతోనే సత్ఫలితాలు
కొవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న జ్వర సర్వేతో సత్ఫలితాలు వస్తున్నాయి. భయంతో ఉన్న ప్రజలను మా వైద్య సిబ్బంది నేరుగా కలిసి వారి మనోధైర్యాన్ని ఇవ్వగలిగాం. కరోనా లక్షణాలు ఉన్నవారికి ముందుగానే గుర్తించి, వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయగలిగాం. ఐదురోజులుగా 7,96,000 మంది ప్రజలకు భరోసా కల్పించాం. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో మంచి ఫలితాలు రావడం ఖాయం.
-సాంబశివరావు, డీఎంహెచ్వో యాదాద్రిభువనగిరి