వాన నీటిని ఒడిసి పట్టేందుకు వాటర్షెడ్ పథకం
సంస్థాన్నారాయణపురం మండలంలోని జనగాం ఎంపిక
రూ.9.42 కోట్ల అంచనా వ్యయంతో సిద్ధమవుతున్న డీపీఆర్
నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
కరువు మండలానికి వరంగా పీఎం కృషి సంచాయ్ యోజన 2.0
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వర్షాకాలంలో విస్తారంగా వర్షాలు కురిసినప్పటికీ ఆ నీరంతా ఆవిరై.. భూగర్భజల మట్టం నానాటికీ పాతాళానికి పడిపోతున్నది. ఈ పరిస్థితులను దూరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. నీటిని పొదుపుగా వాడుకోవడం..వర్షపు నీటిని ఒడిసి పట్టడం వంటి చర్యలతో భూగర్భ జలాలను పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నాయి. భవిష్యత్తులో వచ్చే నీటి సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఐడీబ్ల్యూఎంపీ, వాటర్ షెడ్ వంటి అనేక పథకాలను అమలు చేయగా..తాజాగా కొత్త మార్గదర్శకాలతో పీఎం కృషి సంచాయ్ యోజన(పీఎంకేఎస్వై) 2.0 పథకానికి శ్రీకారం చుట్టాయి. మొదట జిల్లాలో సంస్థాన్నారాయణపురం మండలంలోని జనగాం ప్రాజెక్టులో ఈ పథకానికి కార్యరూపం ఇస్తున్నారు. గిరిజనులు అధికంగా నివసించే కరువు ప్రాంతం కావడంతో ఈ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు.
5 గ్రామ పంచాయతీల పరిధిలో..
జనగాం ప్రాజెక్టు కింద రూ.942.70 లక్షల వ్యయంతో 4,285 హెక్టార్ల విస్తీర్ణంలో వాటర్షెడ్ పథకాన్ని చేపట్టనున్నారు. జనగాం, వైలపల్లి, చిల్లాపురం, పుట్టపాక, కొత్తగూడెం గ్రామపంచాయతీల పరిధిలో ఐదేండ్ల వ్యవధిలో వివిధ రకాల అభివృద్ధి పనులను, కార్యక్రమాలను చేపడుతారు. వాటర్ షెడ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజల భాగస్వామ్యంతోనే పనులను చేపట్టనున్నారు. ముఖ్యంగా పారే నీటిని నిల్వ చేసి అవి భూమిలో ఇంకేలా చేయాలన్న లక్ష్యంతో పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా చెక్డ్యామ్లు, చెక్ వాల్స్, బోర్వెల్స్, రీచార్జ్ స్ట్రక్చర్స్, పండ్ల తోటల పెంపకం, రాక్ ఫిల్ డ్యాం, ఫాం పాండ్స్, నిర్మాణం, ఉన్న వాటి మరమ్మతు పనులు, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం వంటి పనులు చేపడుతారు. వీటితోపాటు పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల జీవనోపాధుల పెంపునకు సంబంధించిన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. వాటర్షెడ్ పథకంలో గ్రామానికి కేటాయించిన నిధుల్లో 4 శాతం నిధులను సోలార్ వీధి లైట్లు, పాఠశాలలకు బెంచీలు, పైపులైన్, బస్ షెల్టర్స్ నిర్మాణం వంటి వాటికి వెచ్చిస్తారు.
వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ..
అదేవిధంగా వ్యవసాయ పరంగా ప్రోత్సాహం అందించేందుకు కల్లం పట్టాలు, తైవాన్ స్ప్రేయర్స్, మినీ పవర్ వీడర్, పవర్ టిల్లర్, గొర్రు, కల్టివేటర్లు, ట్రాక్టర్లు వంటి వాటిని కూడా అర్హులకు అందించనున్నారు. భూమిలేని నిరుపేదల జీవనోపాధిని పెంపొందించేందుకు కిరాణం, బట్టల దుకాణం, వివిధ వృత్తులకు సంబంధించిన యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సంఘ బంధాల ద్వారా రుణాలను సైతం అందించనున్నారు. ఇందుకు అవసరమయ్యే నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వెచ్చిస్తున్నాయి.
డీపీఆర్ రూపొందిస్తున్నాం
గతంలో ఉన్న మార్గదర్శకాల్లో కొద్దిపాటి మార్పులు చేసి పీఎంకేఎస్వై 2.0 పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తున్నది. సంస్థాన్నారాయణపురం మండలంలోని జనగాం ప్రాజెక్టు పరిధిలో ఐదేండ్ల కాలంలో చేపట్టబోయే అభివృద్ధి పనులు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి డీపీఆర్ను రూపొందిస్తున్నాం. దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే ఆయా పంచాయతీల్లో వాటర్షెడ్ కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకుంటాం.
–ఉపేందర్ రెడ్డి, డీఆర్డీఓ, యాదాద్రి భువనగిరి జిల్లా