యాదాద్రి భువనగిరి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని ఆలేరు మండలం మంతపురి బైపాస్ వద్ద చోటు చేసుకుంది. డివైడర్ పనులు చేస్తుండగా కూలీలతో పాటు ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై డివైడర్ మధ్యలో ట్రాక్టర్లో వచ్చిన కూలీలు పనులు చేస్తున్నారు. ట్రాక్టర్ కూడా అక్కడే ఉంది. అదే సమయంలో వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ను, అక్కడే పని చేస్తున్న ఐదుగురు కూలీలను ఢీకొట్టింది. దీంతో అంకర్ల లక్ష్మి, కూరేళ్ల శ్యామ్ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.
ఘటనా స్థలంలో మృతి చెందిన వారిలో మహిళ శరీరం నుజ్జునుజ్జు కాగా.. యువకుడి శరీరం ఆర్టీసీ బస్సు టైరు కింద చిక్కుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన ఇద్దరు కూలీలు రాయగిరికి చెందిన వారు.
ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన క్షతగాత్రుల్లో మరో మహిళ అంకర్ల కవిత చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమించడంతో వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.