బీబీనగర్, ఏప్రిల్ 3 : తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని, ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పలువురు నాయకులు, దొడ్డి కొమురయ్య విగ్రహ కమిటీ సభ్యులు అన్నారు. శుక్రవారం దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా బీబీనగర్ మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య విగ్రహ కమిటీ అధ్యక్షుడు సోము రమేశ్ కురుమ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం పాలనలో రైతులు అనుభవించిన అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు దొడ్డి కొమురయ్య అని పేర్కొన్నారు. రైతాంగ హక్కుల కోసం ఆయన చేసిన త్యాగం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు.
1946 జూలై 4న కడవెండి గ్రామంలో జరిగిన రైతాంగ పోరాటంలో పాల్గొంటూ అమరుడైన దొడ్డి కొమురయ్య త్యాగం తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిందని తెలిపారు. ఆయన చూపిన ధైర్యం, త్యాగం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువత దొడ్డి కొమురయ్య ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా ఏర్పడిన శ్రీ బీరప్ప దేవాలయ కమిటీ అధ్యక్షుడు బండారి బాలయ్యను సంఘం సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోలి పింగల్ రెడ్డి, యర్కల సుధాకర్ గౌడ్, బొక్క జైపాల్ రెడ్డి, రాచమల్ల శ్రీనివాసులు, చింతల సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ గోలి నర్సింహరెడ్డి, మంచాల రవికుమార్, విగ్రహ కమిటీ సభ్యులు జాన సత్యనారాయణ, సోమ ముత్యాలు, కురుమ సంఘం అధ్యక్షుడు బండారి బాలయ్య, సభ్యులు మంగ లింగేశ్, బండ శంకర్, సోము సురేశ్, దావడి రాజు పాల్గొన్నారు.

‘దొడ్డి కొమురయ్య ఆశయాల సాధన అందరి బాధ్యత’