యాదాద్రి : కరివెన సత్రం కాదు అన్నార్తులకు ధర్మక్షేత్రమమని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అన్నారు. దేశంలో ఉన్న అనేక పుణ్యక్షేత్రాల్లో కరివెన సత్రాలను నెలకొల్పాలని ఆకాక్షించారు. ఆదివారం యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించి ప్రసంగించారు. సత్రాలను అభివృద్ధికి బ్రహ్మణోత్తములు సహకారం అందించాలన్నారు. తమవంతు సహకారం ఉంటుందన్నారు. అన్నం ప్రరబ్రహ్మ స్వరూపమని అన్నారు. తన చిన్నతనంలో జోగులాంబ ఆలయంలో మొదటిసారి కరివెన సత్రంలో భోజనం చేసినట్లు గుర్తు చేశారు.
దాదాపు 100 ఏళ్లుగా కరివెన సత్రం సేవలందిస్తున్నదని తెలిపారు. తమ తండ్రి మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు కొండపైనే తెలుగులో ఉన్న ‘వెయ్యి పడగల’ నవల పుస్తకాన్ని హిందీలోకి అన్వదించారన్నారు. వీలున్నప్పుడల్లా నాన్న పీవీగారు యాదాద్రి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రశాంతత పొందేవారని గుర్తు చేశారు. మా ఇంట్లో ఏ కార్యమైన మొదటిసారిగా యాదాద్రీశుడిని దర్శించుకుంటామని అన్నారు.
కార్యక్రమంలో అఖిల భారతీయ బ్రాహ్మాణ కరివెన నిత్యాన్నదానం సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన జరుగగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు, సంస్థ గౌరవ అధ్యక్షుడు కామరాజు నరేంద్ర, సీఏ ఎస్వీ రావు, కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్, ఫణిపవన్ శర్మ, రాఘవశర్మ, సీతరామరాజు పాల్గొన్నారు.