యాదాద్రి, డిసెంబర్ 22 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది. గురువారం ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవను జరిపారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణతంతు నిర్వహించారు. తెల్లవారు జామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహులు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు.
సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు చేపట్టారు. రాత్రి తిరువరాధన చేపట్టి స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయుడికి సహస్రనామార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు నిర్వహించారు. ధునుర్మాసోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున అర్చకులు వేదమంత్రాలు పటిస్తూ అమ్మవార్లకు తిరుప్పావై పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ధనుర్మాస విశిష్టతను వివరించారు. గోదాదేవి, రంగనాయకుడిపై రచించిన పాశురాలను పఠిస్తూ అర్చకులు మార్గళి పూజలు చేశారు. సుమారు 16 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.21,72,197 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
ఉత్తర గోపురం ముందు గ్రిల్స్ ఏర్పాటుకు సన్నాహాలు
జనవరి 2న ముక్కోటి(వైకుంఠ) ఏకాదశి పురస్కరించుకుని స్వామివారి దివ్యక్షేత్రంలో ఏర్పాట్లపై ఆలయ అధికారులు దృష్టి సారించారు. స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వనున్న నేపథ్యంలో ఉత్తర రాజగోపురం ముందు మాఢవీధుల్లో తాత్కాలిక ఇత్తడి గ్రిల్స్ బిగించనున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు వీవీఐపీ, వీఐపీలతో భక్తుల తాకిడి పెరుగనున్న నేపథ్యంలో వారిని ప్రత్యేక క్యూలైన్లో అనుమతించనున్నారు. ముక్కోటి ఏకాదశి అనంతరం గ్రిల్స్ను తొలగించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.