యాదగిరిగుట్ట, మార్చి 26 : శుభకార్యాలకు బంగారం ఆభరణాలు చేయించేందుకు డబ్బులిచ్చిన కొంతమంది.. నగలు తాకట్టు పెట్టిన వారు ఇంకొందరు.. వడ్డీకి డబ్బులు ఇచ్చిన వారు మరికొందరు వీరందరినీ బురిడి కొట్టించి పారిపోయిన జై భవానీ జ్యువెల్లర్స్ యజమానులు జితేందర్లాల్, మధురామును అరెస్ట్ చేసినట్లు యాదగిరిగుట్ట పట్టణ సీఐ రమేశ్ బుధవారం తెలిపారు. విశ్వనీయవర్గాల సమాచారం మేరకు నల్లగొండ జిల్లాలోని చిట్యాల సమీపంలో రెక్కీ నిర్వహించి నిందితులను అరెస్టు చేసిన్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి కేజీ 185 గ్రాముల బంగారం, 84 కేజీల 820 గ్రాముల వెండి అభరణాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు మరో కేజీ 248 గ్రాములు బంగారాన్ని సౌత్ ఇండియా బ్యాంకులో తనఖా పెట్టిన్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు. నిందితుడి వద్ద లభించిన బంగారం, వెండిని సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయనున్నట్లు, కారును సీజ్ చేసి జితేందర్ లాల్, మధు రాములును రిమాండ్కు తరలించిన్నట్లు సీఐ తెలిపారు.
రాజస్తాన్కు చెందిన జితేందర్ లాల్ 15 ఏళ్ల క్రితం పట్టణంలో అద్దె భవనంలో జై భవానీ జ్యువెల్లర్స్ షాపును నెలకొల్పాడు. చాలా ఏళ్లుగా గుట్టలో నమ్మకంగా ఉండటంతో చాలా మంది పట్టణవాసులు జితేందర్ లాల్ వద్ద బంగారం తాకట్టు పెట్టారు. మరికొంత మంది వడ్డీకి పెద్ద మొత్తంలో డబ్బులిచ్చారు. ఇంకా కొంతమంది అభరణాలు చేసి ఇవ్వాలని రూ. లక్షల్లో నగదును అందజేశారు. అయితే గత జనవరి నెలలో షాపును తీయకపోవడంతో అనుమానం వచ్చిన పలువురు జితేందర్లాల్కు ఫోన్ చేయగా స్వీచ్ ఆఫ్ వచ్చింది.
దీంతో భయాందోళనకు గురైన పట్టణవాసులు జనవరి 24వ తేదీన బంగారం షాపు వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడికి సంబంధించిన షాపును సీజ్ చేశారు. ప్రత్యేక బృందం రాజస్తాన్కు సైతం వెళ్లింది. అదే సమయంలో నిందితుడి తండ్రి మృతి చెండడంతో పోలీసులు తిరుగు ప్రయాణమయ్యారు. తాజాగా నింధితుడు బంగారు ఆభరణాలతో పట్టుబడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.