బీబీనగర్, ఏప్రిల్ 4 : బీబీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం 14 సంవత్సరాల కిశోర బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కిశోర బాలికల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకా ఎంతో ఉపయోగకరమని తెలిపారు. 14 సంవత్సరాల వయస్సులో ఈ టీకా వేయించుకోవడం ద్వారా భవిష్యత్లో గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. అర్హత కలిగిన ప్రతి బాలిక ఈ టీకాను తప్పనిసరిగా తీసుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను టీకా కార్యక్రమానికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పావని, సూపర్వైజర్లు శాంతాకుమారి, ప్రభాకర్, ఎంపీహెచ్ఏ వసంత, కవిత, డీఈఓ శ్రీదేవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.