క్షేత్రస్థాయి పర్యటనలో మిషన్ భగీరథ అధికారులు
పైపులైన్లు, సాంకేతిక సమస్యల గుర్తింపు
ఎప్పటికప్పుడు వివరాలు ఆన్లైన్లో నమోదు
మిషన్ భగీరథ నీటిపై అపోహలు తొలగించే దిశగా చర్యలు
మార్చి నెలాఖరుకు పూర్తి కానున్న ప్రక్రియ
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి);మిషన్ భగీరథ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గోదావరి, కృష్ణా జలాలు జిల్లా ప్రజానీకం గొంతు తడుపుతున్నాయి. రూ.750 కోట్ల వ్యయంతో పైపులైన్, రక్షిత తాగునీటి పథకాలను నిర్మించి ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధ జలాన్ని అందిస్తున్నారు. ఫలితంగా గతంలో ఉన్న నీటి ఇబ్బందులు చాలా వరకు తీరాయి. ఈ క్రమంలో రానున్న వేసవిలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. మూడు నెలల క్రితమే క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టిన మిషన్ భగీరథ పథకం అధికారులు ఎక్కడికక్కడ లోటు పాట్లను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియను మార్చి నెలాఖరు వరకు పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించారు. అలాగే నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించడం ద్వారా మిషన్ భగీరథ నీటిపై ఉన్న అపోహలను తొలగించి ప్రజలను చైతన్యపర్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.జిల్లాలో ఏండ్ల నాటి తాగు నీటి సమస్యకు మిషన్ భగీరథ పథకం చెక్ పెట్టింది. పథకం నిర్వహణను పటిష్టంగా పర్యవేక్షిస్తుండడంతో వేసవిలోనూ నీటి ఇబ్బందులు ఉండడం లేదు. పైపులైన్ లీకేజీలు, ఇతర సాంకేతిక సమస్యలు ఏర్పడడం వల్ల కొన్ని సందర్భాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నది. అయితే, వేసవిలో ఈ తరహా సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అధికారులు క్రాష్ ప్రోగ్రాంలో లోటుపాట్లను గుర్తించి సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. సీఈ మొదలుకొని ఏఈ వరకు అంతా క్షేత్రస్థాయి పర్యటనల్లో బిజీగా ఉన్నారు.
జిల్లాలో 1,76,169 గృహాలకు శుద్ధి జలాలు…
జిల్లాలో మొత్తం 769 ఆవాసాలకు రక్షిత జలాలు అందుతున్నాయి. ఇందులో 727 గ్రామీణ, 42 పట్టణ ఆవాసాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,76,169 గృహాలకు గోదావరి, కృష్ణా జలాలు అందుతున్నాయి. ఇందుకుగాను ప్రభుత్వం రూ.750కోట్ల నిధులను వెచ్చించి 556 కొత్త ట్యాంకులు, 53 ఓహెచ్బీఆర్లు, 12 సంపులను నిర్మించింది. జిల్లాలో 17 మండలాలు ఉండగా.. 12 మండలాలకు హెచ్ఎండబ్ల్యూస్ ద్వారా గోదావరి జలాలు అందుతున్నాయి. ఘన్పూర్ గుట్ట రిజర్వాయర్ నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాలతోపాటు భువనగిరి నియోజకవర్గంలోని 135 గ్రామీణ, 11 పట్టణ ఆవాసాలకు లింగోటం ఫిల్టర్ బెడ్ నుంచి కృష్ణా నీటిని సరఫరా చేస్తున్నారు. రామన్నపేట, మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లోని 76 ఆవాసాలకు పానగల్ రిజర్వాయర్ నుంచి కృష్ణా నీటిని సరఫరా చేస్తున్నారు. పాత ట్యాంకులు 808 వరకు ఉండగా.. మిషన్ భగీరథ పథకంలో 556 కొత్త ట్యాంకులను నిర్మించారు. అలాగే 2,207.46 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణాన్ని చేపట్టి సురక్షితమైన తాగునీటి నిరంతరాయంగా అందిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం..
మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించేందుకు మూడు నెలలుగా అధికారులు పట్టణ, పల్లె బాట పట్టారు. సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. పైపులైన్ లీకేజీలు, ఎయిర్ వాల్వ్ల పనితీరు, సిమెంట్ రోడ్ల కటింగ్ వల్ల ఏర్పడిన గుంతలు, పైపులైన్ల నుంచి నల్లా కనెక్షన్ వరకూ నీటి సరఫరాను పరిశీలిస్తున్నారు. ఓవర్హెడ్ ట్యాంక్లకు ప్రధాన పైపులైన్ నుంచి బల్క్ వాటర్ సరఫరా తీరు, ప్రతి ఓవర్ హెడ్ ట్యాంకుకూ నీటి సరఫరా, ట్యాంక్ పైభాగంలో మూతలు పరిశీలిస్తున్నారు. నిత్యం సీఈ నుంచి ఏఈ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఏదో ఒక ఆవాసంలో ముమ్మరంగా తనిఖీలు జరుగుతుండగా.. ట్యాంకుల క్లోరినేషన్ అంశాల గురించి కూడా తెలుసుకుంటున్నారు. తనిఖీలు పూర్తయ్యాక పూర్తి నివేదికను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. సంబంధిత కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి వేగవంతంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.
నీటి వినియోగంపై ప్రజల్లో చైతన్యం నింపేలా…
మిషన్ భగీరథ నీటిపై అపోహలను తొలగించేందుకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. మిషన్ భగీరథ నీటిలో ఆరోగ్యానికి సరిపడా లవణాలున్నాయని ప్రజల్లో చైతన్యం కల్పించే దిశగా కృషి చేస్తున్నారు. ఉదయం వేళల్లో మిషన్ భగీరథ నీటిని, సాయంత్రం వేళల్లో బోరు నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని సర్పంచులు, కార్యదర్శులకు సూచిస్తున్నారు. నిత్యం వివిధ చోట్ల 300 శాంపిళ్లను సేకరించి ఆలేరు, భువనగిరిలో ఉన్న ల్యాబ్లలో పరీక్షలు చేస్తున్నారు. డిజిటల్ పరికరాలతో ప్రజల సమక్షంలోనూ పరీక్షలు నిర్వహించి అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మూడు ఫేజ్లలో చేపట్టిన క్రాష్ ప్రోగ్రాం ప్రక్రియను మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మిషన్ భగీరథ ఈఈ లక్ష్మణ్ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
ప్రభుత్వ సంస్థలకు కూడా..
మిషన్ భగీరథ నీటిని ప్రభుత్వ సంబంధిత సంస్థలకు సైతం అందిస్తున్నారు. జిల్లాలోని 641 ప్రభుత్వ పాఠశాలలు, 762 అంగన్వాడీ కేంద్రాలకు నీరందించేలా పైపులైన్, ఇతర ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కొన్నిచోట్ల విద్యార్థులకు రక్షిత జలాలు అందుతున్నాయి. 13 ఆవాసాల్లో చేపడుతున్న డబుల్ బెడ్రూం ఇండ్లకు తాగునీరందించేందుకు సంబంధిత పనులు పురోగతిలో ఉన్నాయి. 83 రైతు వేదికలకు సైతం శుద్ధి చేసిన జలాలు అందించేలా ఏర్పాట్లు చేశారు.