భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 02 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల్లో చేసింది ఏమీ లేదని, మిగిలిన 750 రోజుల్లో ఏం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు. బుధవారం భువనగిరిలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ తీరుగా తయారు చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెసోళ్లు రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నాయకులపై, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెసోళ్లు బిజెపి నాయకులపై దాడి చేయాలనే కార్యక్రమాలు పెట్టుకున్నారని, ఇటీవల నల్లగొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిలోకి వెళ్లి అధ్యక్షుడి తల్లిని భయభ్రాంతులకు గురి చేశారన్నారు.
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ప్రజలు బిజెపిని అధికారంలోకి తెచ్చారని, తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. దళితులు ఆరాధ్య దైవంగా భావించే సంత్ రవిదాస్ ఫొటోపై కూడా నల్లరంగు పోశారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీపై దాడులు అధికమవుతున్నాయని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రదర్స్ అండ్ కంపెనీ పాలన నడుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.