భువనగిరి కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో కరోనా నిబంధనలను పకడ్భందీగా అమలు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి విద్యాశాఖ అధికారులను, మండల ప్రత్యేకాధికారులకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఆటస్థలం, తరగతి గదులు, లేబోరేటరీ, ఇతర గదులతో సహ పాఠశాల ఆవరణను సంబంధిత సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శుల సమన్వయంతో శుభ్ర పరచాలన్నారు. టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది ఎండిఎం సభ్యులు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉండాలన్నారు.
పాఠశాలల్లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని, ఎవరైనా విద్యార్థి లక్షణాలతో గుర్తిస్తే వెంటనే తల్లితండ్రులకు సమాచారం అందించి అప్పగించాలన్నారు. వంటగది, పాత్రలను రెండుసార్లు శుభ్రం చేయాలని, బియ్యం, ఇతర వస్తువులను శుభ్రం చేసుకుని, ఫర్నీచర్, అల్మారాలు, డెస్కులను శుభ్రం చేసి శానిటైజ్ చేపట్టాలన్నారు. సిబ్బంది, విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, పాఠశాలల ఆవరణల్లో సమావేశాలు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దన్నారు. విద్యార్థులకు కొవిడ్ నిబంధనలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించాలన్నారు. మధ్యాహ్న భోజన సమయాల్లో గుంపులుగా ఉండకుండా తగు చర్యలు చేపట్టి కొవిడ్ నిబంధనలను తూచా తప్పక అమలు చేయాలని ఆదేశించారు.