– యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు
రామన్నపేట, మార్చి25 : పద్దతి మార్చుకొని పని చేయించండి లేకపోతే కాంట్రాక్ట్ లైసెన్సును బ్లాక్ లిస్టులో పెడ్తానని అదనపు కలెక్టర్ భాస్కర్రావు దవాఖానా శానిటేషన్ కాంట్రాక్టర్ను హెచ్చరించారు. బుధవారం రామన్నపేట ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశీలించి శానిటేషన్ కాంట్రాక్టర్కు ఫోన్ చేసి నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో దవాఖాన సూపరింటెండెంట్ సూచనలతో పనులు చేపట్టాలని ఆదేశించారు. సిబ్బందిని నియమించి పూర్తి స్థాయిలో పనులు చేపట్టకపోతే షోకాజ్ నోటీసులు జారిచేసి కాంట్రాక్ట్ లైసన్స్ ను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు.
వైద్యులు, వైద్య సిబ్బంది డిప్యూటేషన్లను రద్దు చేయాలని డీసీహెచ్ఎస్ ను ఫోన్లో ఆదేశించారు. దవాఖాన ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను, డ్రైనేజీ నిర్మాణ పనులను చేయించాలని ఎంపీడీఓ ఆవుల రాములును ఆదేశించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ట్యాక్స్ కలెక్షన్ ఇతర రికార్డులు సరిగ్గా నమోదు చేయక పోవడంతో చర్యలు తీసుకోవాలని డీపీఓను ఫోన్లో ఆదేశించారు. అనంతరం పల్లె ప్రకృతివనం, సర్సరీలను పరిశీలించారు. పల్లె ప్రకృతివనంలో చెట్లను తీసివేయడంపై తాసీల్దార్ లాల్ బహదూర్ ను విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట దవాఖాన సూపరింటెండెంట్ శ్వేత ప్రియాంక, ఏపీఓ వెంకన్న, తదితరులు ఉన్నారు.

‘పద్ధతి మార్చుకొని పనిచేయండి.. లేకపోతే లైసెన్స్ బ్లాక్ లిస్ట్లోకి’