– డీఏలు, పీఆర్సీ, ఓపీఎస్పై ప్రభుత్వం తేల్చాలి
– భువనగిరి నుండి 10 వేల మంది ఉద్యోగుల తరలింపునకు ఏర్పాట్లు
– బీబీనగర్లో చలో హైదరాబాద్ హక్కుల సాధన సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
బీబీనగర్, సెప్టెంబర్ 08 : ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 10న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న చలో హైదరాబాద్ -హక్కుల సాధన సభకు జిల్లా నుండి వేలాది మంది ఉద్యోగులు తరలివెళ్లనున్నట్లు జిల్లా ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ ధరణికోట భగత్ తెలిపారు. సభకు లక్ష మందికి పైగా ఉద్యోగులు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించామని, భువనగిరి జిల్లా నుంచి సుమారు 10 వేల మంది ఉద్యోగులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం బీబీనగర్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ‘చలో హైదరాబాద్ -హక్కుల సాధన సభ’ వాల్ పోస్టర్ను జేఏసీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధరణికోట భగత్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నీ న్యాయమైన డిమాండ్లేనని, వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు.
పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం నివేదికను తీసుకోకపోవడం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల కోసం ప్రభుత్వం జారీ చేసిన ఈహెచ్ఎస్ జీవో అమలు కావడం లేదని, అనేక ప్రైవేట్ ఆస్పత్రులు సైతం ఈహెచ్ఎస్ను అంగీకరించకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, ఎండీవో శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు యాదయ్య, రమేష్, రాములు, లింగయ్య, పంచాయతీరాజ్ శాఖకు అధికారులు శ్రీకాంత్ రెడ్డి, శశికాంత్ గౌడ్, ఇంద్రసేనరెడ్డి, జిల్లా నాయకులు ఖదీర్, శ్రీనివాస్, పెన్షనర్ సంఘం బాలరాజ్ పాల్గొన్నారు.