BRICS Summit : ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సుకు ఈ ఏడాది ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కిన్ వంటి కీలక నేతలు హాజరుకానున్నారు. దీంతో ఈ సదస్సుపై ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇలా ఇరాన్ అధ్యక్షుడు ప్రపంచ దేశాధినేతలతో అంతర్జాతీయ సదస్సులో సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఈ సదస్సులో వివిధ దేశాధినేతలు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఏడాది వ్యవధిలో ఇండియాలో పర్యటించనుండటం రెండోసారి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చాలా ఏళ్ల తర్వాత ఇండియా వస్తున్నారు. అనేక విబేధాలున్న ఇండియా-చైనా మధ్య పలు సమస్యల పరిష్కారానికి, సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
గత ఏడాది మోదీ కూడా చైనాలో పర్యటించారు. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ దేశ అధ్యక్షుడు ఇండియాలో పర్యటిస్తుండటం కూడా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సదస్సుకు ఈజిప్ట్, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, ఫిలిప్పైన్స్ దేశాధ్యక్షులు కూడా హాజరవుతున్నారు. అలాగే, అబుదాబి రాజకుమారుడు, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి కూడా హాజరవుతారు. ప్రపంచలోని అగ్రదేశాలకు చెందిన నేతలు హాజరవుతున్నందున ఢిల్లీలో సదస్సు కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని అనేక ఫైవ్ స్టార్ హోటళ్లను ప్రభుత్వం సిద్దం చేసింది. భద్రతా ఏర్పాట్లు కూడా భారీగాచేసింది.