బీబీనగర్, అక్టోబర్ 17 : బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ లేఖ రాశారు. ఈ నెల 13వ తేదీన దత్తాత్రేయ బీబీనగర్ ఎయిమ్స్ను సందర్శించి అధ్యాపకులు, విద్యార్థులు, రోగులతో మాట్లాడిన విషయం తెలిసిందే. తన పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎయిమ్స్ అభివృద్ధికి పలు సూచనలను చేస్తూ లేక పంపారు. తెలంగాణ రాష్ట్రానికే ప్రధాన వైద్య సంస్థ అయిన బీబీనగర్ ఎయిమ్స్ ఎక్కువ మందికి సమర్థవంతంగా సేవలందించగలదని వైద్యం, విద్య , ఆరోగ్య సంరక్షణలో అత్యున్నత సేవలు అందించగలదన్నారు. తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం మధ్య సహకార సమాఖ్య స్ఫూర్తితో బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధి అవుతుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా పది లక్షల మంది ఔట్ పేషెంట్లకు సేవలందిచనుందని, తెలంగాణలో ఆధునిక ఆరోగ్య సేవలకు కేంద్ర బిందువుగా అవతరిస్తుందన్నారు.
నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) లో అత్యున్నత ర్యాంక్ సాధించనుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో 2019లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన బహుమతి బీబీనగర్ ఎయిమ్స్ అన్నారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి 163కు ఆనుకుని ఎయిమ్స్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 200 ఎకరాలను కేటాయించిందని తెలిపారు. ఎంబీబీఎస్ తొలి బ్యాచ్ విద్యార్థులు ఇటీవలే గ్రాడ్యుయేట్లు అయ్యారన్నారు. ఎయిమ్స్ బీబీనగర్ చుట్టూ మౌలిక సదుపాయాలు కల్పించాలని, 163 జాతీయ రహదారిపై ప్రతి నిత్యం 250కి పైగా బస్సులు నడుస్తున్నాయని, వాటికి ఎయిమ్స్ ఆవరణలో స్టాప్ ఏర్పాటు చేసి సర్వీసు రోడ్డు ద్వారా ప్రయాణించేట్టు టీజీఎస్ఆర్టీసీని ఆదేశించాలన్నారు. ఘట్కేసర్ నుండి బీబీనగర్ ఎయిమ్స్కు సిటీ బస్సు సేవలు విస్తరించాలన్నారు. ఎంఎంటీఎస్ పొడిగింపు, బస్ డిపో ఏర్పాటు, ఎలక్రిక్ వాహనాల వంటి సేవలు కల్పించాలన్నారు. జాతీయ రహదారులు 163ని, 191పి ని అనుసంధానం చేసేలా బస్సులు ఏర్పాటు చేయాలన్నారు.
ఎయిమ్స్లో అధునాతన అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని, శిక్షణ పొందిన అగ్నిమాపక సిబ్బందిని నియమించాలన్నారు. సిబ్బంది కుటుంబాలకు నాణ్యమైన విద్యను అందించడానికి ఎయిమ్స్ సమీపంలో సెంట్రల్ లేదా ప్రైవేట్ స్కూల్ జోన్ను ఏర్పాటు చేయాలన్నారు. యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్ క్యాంపస్ చుట్టూ అవసరమైన పౌర, పరిపాలనా సౌకర్యాల సమన్వయ అభివృద్ధికి ఎయిమ్స్ అధికారులతో కలిసి పనిచేయాలన్నారు. రోడ్లు, భవనాలు, రెవెన్యూ, మున్సిపల్, విద్య, అగ్నిమాపక సేవల విభాగాలతో ఉమ్మడి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ విభాగాల అధికారులకు నిర్దిష్ట పాత్రలను కేటాయించాలన్నారు. ఎయిమ్స్ బీబీనగర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రయోజనకరంగా ఉందని, ఎన్హెచ్ 163, ఎన్హెచ్ 191పి, బీబీనగర్ రైల్వే జంక్షన్ ద్వారా అద్భుతమైన రవాణా సదుపాయాలు కల్పించాలన్నారు. తెలంగాణలో వైద్య, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, ఎయిమ్స్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ స్థలాన్ని ఎంచుకున్నారన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య స్థిరమైన భాగస్వామ్యంతో ఈ సంస్థ నిజంగా సమగ్ర వృద్ధి, ప్రజారోగ్య సేవలకు ఒక నమూనాగా ఉద్భవించగలదని లేఖ ద్వారా ఆయన ఆకాక్షించారు.
Bibinagar : బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధిపై సీఎం రేవంత్కు బండారు దత్తాత్రేయ లేఖ