యాదగిరిగుట్ట, ఏప్రిల్ 11 : అవినీతి, అసమర్థ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న డైరక్టర్లు అదే చైర్మన్కు అమ్ముడుపోయారని నార్మూల్ మదర్ డెయిరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి ఆరోపించారు. ఒక్కో డైరెక్టర్కు చైర్మన్ గుడిపాటి రూ.5 లక్షలు ముట్టజెప్పినట్లు ప్రచారం సాగుతుందన్నారు. శుక్రవారం యాదగిరిగుట్టలో మీడియాతో ఆయన మాట్లాడారు. పాడి రైతులకు 6 బిల్లులు పెండింగ్ పెట్టి ఛైర్మన్ గుడిపాటి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మంది డైరక్టర్లు గుట్టలోని రెడ్డి సత్రంలో రహస్యంగా సమావేశమైనట్లు రైతులు చర్చించుకున్నట్లు చెప్పారు. చైర్మన్ను వెంటనే గద్దె దింపాలని, ఆయన తీరుతో సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోతుందని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు ఫిర్యాదు చేసింది వాస్తవం కదా అని ఆయన ప్రశ్నించారు.
ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో సమావేశం అనంతరం డైరక్టర్లు ఎందుకు మాట మార్చారో సమాధానం చెప్పాలన్నారు. ప్రతి పక్షాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. డైరక్టర్లు అంతా ఏకపక్షంగా చైర్మన్ తీసివేసి వేరే వారిని నియమించాలని చెప్పి మాట మార్చినట్లు తెలిపారు. డబ్బులతో డైరక్టర్లను కొనుగోలు చేసి చైర్మన్గా కొనసాగాలని గుడిపాటి చూస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పాడి రైతులకు సబ్సిడీపై గేదెలను అందజేశారని, లీటరు పాలకు రూ.4 బోనస్ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా నార్మూల్ సంస్థకు ఒక్క రూపాయి మంజూరు చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో నార్మూల్ సంస్థకు ఉన్న పెండింగ్ బిల్లులను అందజేయడంతో పాటు ప్రభుత్వం తరఫున రూ.30 కోట్ల గ్రాంట్లు మంజూరు చేయిస్తామని చెప్పిన అసమర్థ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఎందుకు మంజూరు చేయలేకపోతున్నారో పాడి రైతులకు వివరణ ఇవ్వాలన్నారు. డైరక్టర్ల ఓట్లను దండుకునేందుకు క్యాంపులు నిర్వహించి క్యాబరే డాన్స్ లతో ప్రలోభాలకు గురి చేసినట్లు తెలిపారు.
వారి అసమర్థతతో నార్మూల్ సంస్థ మూసివేసే పరిస్థితికి చేరుకుందన్నారు. ఒక్క రూపాయి కేటాయించని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేకు సంస్థ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అవినీతికి కేరాఫ్గా పేరొందిన గుడిపాటిని కొనసాగిస్తారా లేక వేరే వ్యక్తిని పెట్టుకుంటారా అనేది వారి ఇష్టమని, కానీ పాడి రైతులకు పెండింగ్లో ఉన్న 6 బిల్లులు, ఉద్యోగులకు జీతాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రోజుకు 40 వేల లీటర్ల ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించిన పాలకు డబ్బులు వెంటనే అందజేస్తున్న చైర్మన్, పాల సంఘాలకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. సంఘాల నుంచి వచ్చిన డబ్బులు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయాల్లో సానుకూల స్పందన లేకపోతే సంస్థకు పాలను విక్రయించబోమని, 400 సంస్థల నుంచి త్వరలో నోటీసులు జారి చేయడంతో పాటు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నార్మల్ మదర్ డెయిరీ డైరక్టర్ కందాల అలివేలు రంగారెడ్డి, మాజీ డైరెక్టర్లు దొంతిని సోమిరెడ్డి, ఒగ్గు భిక్షపతి, పాల సంఘం చైర్మన్లు మైదం రంగన్న, సతీశ్రెడ్డి, రాములు, సురేశ్ పాల్గొన్నారు.