– ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు
– హైదరాబాద్-యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ పొడిగింపునకు కృషి
– ఎయిమ్స్ పనుల పురోగతిపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సమీక్ష
బీబీనగర్, ఫిబ్రవరి 3 : బీబీనగర్ మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ లో కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిని, అందుతున్న వైద్య సేవలను ఆయన పరిశీలించి మాట్లాడారు. తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు సులభంగా, సమగ్ర వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బీబీనగర్ వద్ద ఎయిమ్స్ను నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం గతంలో అందించిన పాత భవనాలు ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో వాటిని రీ-మోడలింగ్ చేసి, కొత్త డిజైన్ ప్రకారం పునర్నిర్మాణం చేపట్టామని వివరించారు. ఆసుపత్రి, మెడికల్ కాలేజీ, బాలుర-బాలికల హాస్టళ్లు, డైనింగ్ బ్లాక్స్ తదితర అన్ని నిర్మాణాలు ఆధునిక ప్రమాణాలతో కొనసాగుతున్నాయని చెప్పారు.

AIIMS Bibinagar : ‘ఈ ఏడాది చివరి నాటికి బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభం’
ఇప్పటివరకు 86 శాతం పనులు పూర్తయ్యాయని, మొత్తం 201 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం సాగుతుందన్నారు. నిర్మాణాల పూర్తి అనంతరం 750 పడకలతో పూర్తి స్థాయి వైద్య సేవలు ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటివరకు రూ.832 కోట్లు ఖర్చు కాగా మొత్తం రూ.1,110 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. ఎయిమ్స్ ప్రారంభమైనప్పటి నుండి 15 లక్షల మందికి పైగా ఓపీ సేవలు అందించగా, ప్రస్తుతం రోజుకు సగటున 1,800 మంది ఓపీ రోగులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. డయాలసిస్, ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ సేవలు కొనసాగుతున్నాయన్నారు. ఎంబీబీఎస్, బీఎస్సీ, ఎంఎస్సీ, నర్సింగ్ కోర్సులు నడుస్తుండగా, 880 మంది విద్యార్థులు చదువుతున్నారని వెల్లడించారు. ఇప్పటికే రెండు బ్యాచ్ల ఎంబీబీఎస్ విద్యార్థులు పట్టాలు పొందారని తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ ట్రిపుల్ ఆర్ – ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో, జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో నల్లగొండ, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల ప్రజలకు ఉత్తమ కనెక్టివిటీ ఉందన్నారు.

AIIMS Bibinagar : ‘ఈ ఏడాది చివరి నాటికి బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభం’
భవిష్యత్లో రీజినల్ రింగ్ రోడ్ పూర్తయితే మరింత మెరుగైన అనుసంధానం లభిస్తుందన్నారు. రోగుల అటెండెంట్లకు వసతి సదుపాయాల కోసం ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యంపై ఆలోచన జరుగుతోందన్నారు. రైల్వే సౌకర్యాల పరంగా బీబీనగర్ స్టేషన్లో మరిన్ని రైళ్లు ఆపేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని, హైదరాబాద్-యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రెండో దశ ప్రారంభించి రవాణా సౌకర్యం మరింత మెరుగుపర్చేందుకు చర్యలు చేపడతామన్నారు. 2026 చివరి నాటికి బీబీనగర్ ఎయిమ్స్ను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ అమితా అగర్వాల్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బిజెపి నాయకులు బోయపల్లి గోపాల్రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, అంబటి తరుణ్రెడ్డి, ఇంజమూరి ప్రభాకర్, కాసుల శ్రీకాంత్గౌడ్, కొలను లక్ష్మారెడ్డి, పొట్ట నవీణ్కుమార్ పాల్గొన్నారు.