డే బెట్ ఆన్లైన్ గేమ్ బాధితులు 500మందికి పైనే..
జిల్లాలో చైన్ లింక్గా పెరుగుతున్న సంఖ్య
వేలల్లో ఆశ చూపి లక్షల రూపాయలు కొట్టేస్తున్న వైనం
చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం మండలాల్లో రూ.2కోట్లకుపైగా నష్టపోయిన యువత
చౌటుప్పల్ , జనవరి 11 :ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్కు చిక్కుతున్న బాధితుల సంఖ్య జిల్లావ్యాప్తంగా పెరుగుతున్నది. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో పది రోజుల నుంచే ఈ యాప్ పేరు వినిపిస్తుండగా, ఇప్పటికే 500మందికిపైగా బాధితులు 2 కోట్ల రూపాయలకు పైగా కోల్పోయినట్లు తెలుస్తున్నది. బైక్లు, సెల్ఫోన్లు, గోల్డ్ చైన్లు అమ్ముకుని, ఎవరికీ చెప్పుకోలేక తెలియక కుమిలిపోతున్న పరిస్థితి. ఇలాంటి ఆన్లైన్ యాప్లను నమ్మి జీవితాలను ఆగం చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
డే బెట్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ పేరుతో యువతను ఆకర్షిస్తున్న మోసగాళ్లు వారి నుంచి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. వేలల్లో బెట్టింగ్ పెడితే లక్షల్లో సంపాదించవచ్చని నమ్మిస్తూ అమాయక యువతను తమ వైపునకు ఆకర్షిస్తున్నారు. ఒకరిని చేర్పిస్తే కమీషన్ ఇస్తూ.. మొదట లాభాలు వస్తున్నట్లు నమ్మిస్తూ.. చైన్ లింక్ ద్వారా వందలాది మందిని ఈ మాయలోకి దింపుతున్నారు. వారి ఉచ్చులో పడిన వారు లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికే చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం మండలాల్లో రూ.2కోట్ల వరకు నష్టపోయారు.
300 మందితో గ్రూప్..
డే బెట్ ఆన్లైన్ గేమ్ మోజులో పడి యువత పెద్ద ఎత్తున డబ్బులు నష్టపోతున్నారు. ఒకరి నుంచి మొదలై చైన్ లింక్తో వందలాది మందిని గ్రూప్గా ఏర్పాటు చేస్తున్నారు. 300 మందితో గ్రూప్ ఏర్పాటు చేస్తున్న డే బెట్ నిర్వాహకులు వారితో ఈ గేమ్ ఆడిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఈ ఆన్లైన్ గేమ్ ఆడాలంటే అతడి అకౌంట్లో కనీసం రూ. 10వేలు ఉండాలనే నిబంధన పెట్టారు. ఆటలాడుతున్న వ్యక్తి పేరుతో గేమ్ నిర్వాహకులే అకౌంట్ ఓపెన్ చేయడంతో పాటు సదరు అకౌంట్ ట్రాన్జాక్షన్ మొత్తం వారి ఆధీనంలో ఉంచుకుంటున్నారు. వారు క్రియేట్ చేసిన అకౌంట్లోనే రూ.10వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గేమ్లో భాగస్వాములైన వ్యక్తి మరో వ్యక్తిని ఈ చైన్లో చేర్చితే అతడికి రూ. 2వేల కమీషన్ చెల్లిస్తున్నారు. ఇలా యువతను ఆకర్షించి మరింత మందిని ఇందులో భాగస్వాములుగా చేస్తున్నారు.
లాభాల ఆశచూపి..
మొదట ఆడుతున్న వ్యక్తులకు రోజుకు రూ. వెయ్యి నుంచి రూ. 5వేలు గెలిచావంటూ ఆశచూపుతూ వారి అకౌంట్లో డబ్బులు జమచేస్తారు. ఇది లాభసాటిగా ఉందని భావించిన యువత మరింత మందిని ఈ గేమ్లో చేర్చుతున్నారు. తమకు లాభాలు రావాలని ఒక్కో వ్యక్తి మూడు నుంచి నాలుగు అకౌంట్లు తెరిచి మరీ గేమ్ ఆడుతున్నారు. ఆన్లైన్ గేమ్ ఆడే వారికి వారం పది రోజుల పాటు లాభాలు వచ్చేలా చేసి ఆ తర్వాత వారి అకౌంట్ల నుంచి రూ. లక్షలు కాజేస్తున్నారు. మొదట మీ అకౌంట్లోంచి రూ. 5వేలు పోయాయని, రూ. 10వేలు ఉంటేనే ఆట ఆడేందుకు వీలుంటుందని చెబుతూ మరో రూ. 5వేలు జమచేయాలని ఒత్తిడి తెస్తారు. తిరిగి గెలుచుకోవచ్చనే భ్రమలో పడిన యువత ఐదువేలు జమ చేస్తున్నారు. ఇదే రీతిలో వారి అకౌంట్లోంచి డబ్బులు కాజేస్తున్నారు. ఈ రోజు డబ్బులు పోయినవని నిరాశ చెందకండి..రేపు మీరే లక్షల్లో గెలుచుకోవచ్చు.. అంటూ ఆశచూపుతున్నారు. ఈగేమ్ యాయలో పడ్డ యువత తమ బైక్లు, సెల్ఫోన్లు, బంగారు నగలు అమ్ముకొని మరీ ఆట ఆడుతున్నారు. 15 నుంచి 20 రోజుల తర్వాత గానీ తాము మోసపోయామని వారు తెలుసుకోలేని పరిస్థితి. ఆ తర్వాత ఏమీ చేయలేక, ఎవరికీ చెప్పుకోలేక మిన్నకుంటున్నారు. ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు ఏమంటారోనని భయాందోళనతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.
ఒక్క ఊరిలోనే రూ.60 లక్షలకు పైగా..
చౌటుప్పల్ లోనే సుమారు 500 నుంచి 600 మంది ఈ డే బెట్ గేమ్ ఆడి రూ. 60 లక్షల నుంచి రూ. కోటి వరకు నష్టపోయినట్లు తెలుస్తున్నది. ఈరోజు ఆడితే రూ. 10వేలు వచ్చే చాన్స్ఉందని గ్రూప్ అడ్మిన్ల నుంచి మెసేజ్లు వస్తున్నాయి. అయితే వారి మోసాన్ని గ్రహించిన కొందరు డబ్బులు తీసుకునేందుకు యత్నించినా సాధ్యం కావడం లేదు. ఇప్పటికే చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం మండలాలతో పాటు జిల్లా వ్యాప్తంగా చాపకింద నీరులా ఈ డే బెట్ గేమ్ విస్తరిస్తున్నది. చౌటుప్పల్ మండలంలోని పీపల్పహాడ్, అంతమ్మగూడెం, డి. నాగారం, అల్లాపురం తదితర గ్రామాల యువత ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టి రూ. 50లక్షల నుంచి రూ. కోటికి పైనే నష్టపోయారు. చౌటుప్పల్ మండలంలోని ఓ గ్రామంలో సుమారు రూ.60 లక్షలు నష్టపోయినట్లు సమాచారం.
గేమ్ అడ్మిన్లపై చర్యలు తీసుకోవాలి
డే బెట్ గేమ్ మోజులో పడి యువత రూ.లక్షల్లో నష్టపోతున్నారు. ఇప్పటికే చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం మండలాల్లో చాలా మంది ఈ యాప్కు బానిసలై తీవ్రంగా నష్టపోయారు. చైన్లింక్ ద్వారా ఈ గేమ్ విస్తరిస్తున్నది. తాము మోసపోయామని తెలుసుకునేలోపే అకౌంట్లోని డబ్బులు కాజేస్తున్నారు. గ్రూప్ ఆడ్మిన్లపై చర్యలు తీసుకోవాలి.
-కొయ్యడ శేఖర్గౌడ్, చౌటుప్పల్
ఆన్లైన్ మోసాలకు పాల్పడితే చర్యలు
ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. డే బెట్ లాంటి ఆన్లైన్ గేమ్ల సమాచారం మాకు అందలేదు. యువత ఆన్లైన్ మోసాలపై అవగాహన పెంచుకోవాలి. ఇలాంటి యాప్ల ద్వారా గ్రూప్లు క్రియేట్ చేసి మోసం చేస్తున్న గ్రూప్ అడ్మిన్లపై చర్యలు తీసుకుంటాం.
-ఎన్. శ్రీనివాస్, సీఐ, చౌటుప్పల్