యాదాద్రి ఆలయ ప్రధానార్చకులు నల్లంధీగల్ లక్ష్మీనారసింహాచార్యులు
సీఎం కేసీఆర్కు జన్మదిన మంగళ శాసనములు
యాదాద్రి, ఫిబ్రవరి16 : ‘ఒకనాడు బ్రాహ్మణులను ఏ ప్రభుత్వాలూ పట్టించుకోలేదు. దైవ దర్శనానికి వచ్చి ఏదో వచ్చామా.. దర్శించుకున్నామా.. అన్నట్టుగా ఉండేవాళ్లు. నాలుగు దశాబ్దాల అర్చకత్వంలో ఎన్నో వ్యధలు అనుభవించాం.. చాలీచాలని వేతనాలతో కాలం వెల్లదీశాం.. మహా విష్ణువా మాకు గుర్తింపునియ్యవయ్యా అని వేడుకునేవాళ్లం. కానీ ఎదురుచూపులే మిగిలాయి. అత్యంత ఆధునికంగా ఉండి దేవుడిని మరిచిపోయారో ఏమో, వ్యక్తిగతంగా పూజించుకున్నారో ఏమో తెలియదుకానీ బ్రాహ్మణోత్తములను మరిచారు. ముఖ్యమంత్రివర్యులు శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సనాతన వేద సంప్రదాయాలను నమ్ముకుని జీవిస్తున్నారు. ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ప్రతి దేవాలయంలో నిత్యదూపదీప నైవేద్యాలను ప్రవేశపెట్టి, బ్రాహ్మణోత్తములు, వైష్ణవోత్తములను ఆదుకుంటున్నారు’ అని యాదాద్రి ఆలయ ప్రధానార్చకులు నల్లంధీగల్ లక్ష్మీనారసింహచార్యులు తెలిపారు. మహనీయమైన, సుస్థిరమైన సుపరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదినోత్సవం పురస్కరించుకుని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి శుభ మంగళాశాసనములు అందించారు. ‘65 సంవత్సరాల వయో పరిమితి పెంచుతూ జీవోను విడుదల చేశారు. మతపరమైన పూజారులు, వంటస్వాములు, నాదస్వర పండితులకు వర్తింపజేశారు. రాష్ట్ర ఏర్పాటుతోనే బ్రాహ్మణ పరిషత్ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వోద్యోగులకు సమానంగా పీఆర్సీ వర్తింపజేశారు. తెలంగాణలోని ప్రతి పూజారి ప్రస్తుతం ఆనందంగా ఉన్నారు. చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకూ ట్రెజరీ జీతాలు ఇవ్వడం సీఎం కేసీఆర్కే దక్కింది. కేవలం హిందూ దేవాలయాలే కాదు, ప్రతి మతాన్ని, కులాన్ని గౌరవించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని వెయ్యి విధాలుగా.. వెయ్యి వైభవాలుగా.. వెయ్యి ఏండ్ల చరిత్రను సృష్టిస్తూ యావత్ హిందువుల మనోభావాలన్ని పరిపుష్ట్యం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.