మంత్రపూర్వకంగా స్నానమాచరించిన స్వామివారు
ఘనంగా మహాపూర్ణాహుతి.. పుష్పయాగం
యాదాద్రి, ఫిబ్రవరి 16 : పాతగుట్ట లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం చక్రతీర్థ స్నానం జరిపించారు. కల్యాణం, రథోత్సవంతో అలసిపోయిన స్వామికి చక్రతీర్థ సేవ నిర్వహించి శృంగార డోలోత్సవానికి సిద్ధం చేశారు. శ్రీదేవీ, భూదేవీ సమేతంగా స్వామివారు చక్రాళ్వార్తో కలిసి మంత్రపూర్వక స్నానం గావించారు. చక్రతీర్థాన శ్రీధరుడే ఆడగా.. కలియుగమే శిరమొంచి ప్రణమిల్లినట్లుగా భక్తులు శ్రీవారిని స్మరిస్తూ పుష్కరిణిలో ఆనందతాండవం చేశారు. అంతకుముందు ఆలయంలో మహాపూర్ణాహుతి నిర్వహించారు. స్థానిక భజన మండలి సభ్యులు భజన నిర్వహించారు. వేదపారాయణాలు జరిపించారు.
పుష్పయాగం, డోలారోహణం..
శనివారం సాయంత్రం పుష్పయాగం, డోలారోహణం, దేవతా ఉద్వాసన నిర్వహించారు. ఉత్సవాలకు ఆహ్వానించిన దేవతలను అనంతరం తిరిగి వారి స్వస్థలాలకు పంపించే వేడుకను దేవతా ఉద్వాసనగా, భగవానుడి నామాలతో అర్చన నిర్వహించే ప్రక్రియను పుష్పయాగంగా పేర్కొంటారు. సహస్ర నామాలతో అమ్మవారిని, భగవానుడిని పుష్పాలతో ఆరాధించారు. భగవానుడికి ప్రీతి కలిగేలా లయబద్ధంగా యజ్ఞాచార్యులు, అర్చక బృందం వేడుక నిర్వహించారు. వేడుకల్లో ఆలయ అనువంశికధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎన్.గీత, ఆలయ ప్రధానార్చకుడు మోహనాచార్యులు, పాతగుట్ట ప్రధానార్చకుడు మాధవాచార్యులు, ఉప ప్రధానార్చక బృందం, ఆలయ ఏఈఓలు రమేశ్బాబు, శ్రవణ్కుమార్, భాస్కర్శర్మ, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
అలంకార జోడుసేవ..
యాదాద్రి సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు బుధవారం సాయంత్రం అలంకార జోడు సేవ నిర్వహించారు. జోడు సేవలో పాల్గొన్న భక్తులు స్వామివారి సేవ ముందు భగవన్నాస్మరణ చేస్తూ మంగళహారతులు ఇచ్చారు. సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపారు. ఉత్సవమూర్తులను మండపంలో పంచామృతాలలో అభిషేకించి తులసీ అర్చనలు జరిపారు. లక్ష్మీనరసింహుడిని దివ్య మనోహరంగా అలంకరించి సుదర్శన హోమం, కల్యాణం, అలంకార సేవోత్సవాలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కొండపైన శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. సత్యనారాయణ స్వామి వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. అన్ని విభాగాలను కలుపుకుని శ్రీవారి ఖజానాకు రూ.10,46,614 సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి ఆశీర్వచనం..
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆలయ ఈఓ, అర్చకులు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం హైదరాబాద్లో మంత్రిని కలిసి స్వామివారి ప్రసాదం అందజేయగా, అర్చకులు వేద ఆశీర్వచనం అనుగ్రహించారు.
నేడు ఆష్టోత్తర శతఘటాభిషేకం..
పాత గుట్ట బ్రహోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 9 గంటలకు స్వామివారికి ఆష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు మహదాశీర్వచనం, పండిత సన్మానం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు.