భేరిపూజ, దేవతాహ్వానం
నేటి నుంచి స్వామివారి విశేష ఉత్సవాలు
యాదాద్రి, ఫిబ్రవరి 12 : పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధ్వజారోహణం వైభవంగా నిర్వహించారు. భేరిపూజ, గరుత్మంతుడితో దేవతాహ్వానాన్ని అర్చకులు సంప్రదాయబద్ధంగా జరిపారు. శ్రీమన్నారాయణుడి వాహనమైన గరుత్మంతుడిని ఆహ్వానించి సకల దేవతలకు యాదాద్రీశుడు పెళ్లికొడుకు అవుతున్నారని, సబ్బండ బంధుగణంతో తరలిరావాలనే ఆహ్వానాన్ని పంపే తంతును వేద పండితులు, అర్చకులు, పారాయణీకులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను ఉదయం పంచామృతాలతో అభిషేకించి, ముస్తాబు చేసి పుష్పాలతో అలంకరించారు. స్వామి, అమ్మవార్లను ధ్వజస్తంభానికి ఎదురుగా ప్రత్యేక పీఠంపై అధిష్ఠింపజేసి ధ్వజారోహణ తంతు నిర్వహించారు. ధ్వజస్తంభానికి దర్బాలతో తయారు చేసిన తాడుతో గరుత్మంతుడి చిత్రపటం ఉన్న వస్ర్తాన్ని కట్టారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆరాధనలు చేసి, 33 కోట్ల మంది దేవతలను ఆహ్వానించారు.
ఆలయంలో హవనం..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు ఎదురుగా అగ్నిప్రతిష్ఠ చేసి.. రాగి, మేడి, జువ్వి, మోదుగు, మామిడి కర్రలతో హోమాన్ని వెలిగించారు. నారాయణ, లక్ష్మి, సుదర్శన, నారసింహ, ఆంజనేయ, గరుడ మొదలైన మూలమంత్రాలతో హవనం చేశారు. నిత్యారాధనల అనంతరం వేదపారాయణాలు, మూలమంత్ర, అనుష్టానం చేశారు. సకల దేవతలకు భేరి నినాదాలు, మంగళవాయిద్యాలతో రాగ, తాళయుక్తంగా ఆవాహనం చేసి గర్భాలయంలోని ప్రధాన కలశంలో అధిష్ఠింపజేశారు. వేడుకల్లో ఆలయ ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ ప్రధానార్చకుడు మోహనాచార్యులు, పాతగుట్ట ఆలయ ప్రధానార్చకుడు మాధవాచార్యులు, ఉప ప్రధానార్చకుడు, ఏఈఓ భాస్కర్, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు ఎదుర్కోలు..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీవారు పెళ్లికొడుకుగా ముస్తాబు కానున్నారు. ఈ సందర్భంగా ఎదుర్కోలు ఉత్సవం, వివాహ నిశ్చయ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు హవనం, సింహ వాహనసేవ, సాయంత్రం 6 గంటలకు హవనం, రాత్రి 8 గంటలకు ఎదుర్కోలు నిర్వహిస్తారు. రాత్రికి శ్రీవారు అశ్వవాహన సేవలో ఊరేగుతారు. అనంతరం శ్రీవారి వివాహ నిశ్చయ ఘడియలు ఖరారు చేసే తంతును రాత్రి 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు.