యాదాద్రి, జూలై25: యాదాద్రీశుడి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవానికి వినియోగించే స్వామివారి దివ్యవిమాన రథాన్ని ఆదివారం ఆలయ అధికారులు ప్రధానాలయ తిరువీధుల్లో ట్రయల్ రన్ నిర్వహించారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగం గా ఆధునీకరించిన రథాన్ని తిప్పుతూ లోపాలను గుర్తించేందుకు ట్రయల్ రన్ చేపట్టారు. స్వామివారి రథం గతంలో 21 ఫీట్ల పొడవు, 12×12 వెడల్పు ఉండేది. కానీ తాజాగా రథం ఎత్తును 27 ఫీట్ల వరకు పెంచి, ఆధ్యాత్మికత పెంపొందే లా దేవతామూర్తుల ఆకారాలను చెక్కి మరమ్మతులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రధానాలయ తిరువీధుల్లో రథాన్ని తాళ్లతో లాగుతూ, స్టీరింగ్ చక్రాన్ని తిప్పుతూ పరిశీలించారు. ఈ సందర్భం గా రథం ఆధునీకరణలో లోపాలు లేవని ఆల య ఈవో ఎన్. గీత సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే రథాన్ని భద్రపరిచేందుకు ప్రధానాలయంలో వాయుదిశలో నిర్మించిన లిప్టురూం పక్కనే 31 ఫీట్ల ఎత్తు, 19.5 ఫీట్ల వెడల్పు, 18.5 ఫీట్ల పొడవుతో రథశాలను నిర్మించారు. ఈ రథశాల అంచులకు దేవతామూర్తులతో తయారు చేసిన ఫైబర్ తొడుగులను బిగించారు. పరిశీలన అనంతరం రథాన్ని రథశాలలో భద్రపరిచారు. కార్యక్రమంలో ఆలయ విద్యుత్ విభాగం ఈఈ రామారావు, ఏఈవో గజవెల్లి రమేశ్బాబు, ఈవో సీసీ, ఆలయ అధికారులు పాల్గొన్నారు.