చిన్నమేడారం జాతరకు పోటెత్తిన భక్తజనం
రాజాపేట, ఫిబ్రవరి 16 : భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న చిన్నమేడారం సమ్మక్క సారక్క జాతర ఉత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా కొనసాగాయి. జాతర రెండో రోజు కుర్రారం శివారులోని ఎదుగులగుట్టపై సారలమ్మకు పూజారులు సంప్రదాయ పూజలు చేశారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య గద్దెపైకి చేర్చారు. వన దేవత గద్దెపై ఆసీనులయ్యే సమయంలో ఆ ప్రాంతమంతా భక్తిభావంతో పులకించిపోయింది. సారలమ్మ తల్లీ సల్లంగా దీవించమని భక్తజనం రెండు చేతులెత్తి వేడుకున్నారు. గద్దెపై ఆసీనులైన సారలమ్మకు భక్తులు పెద్ద పెద్ద ఎత్తున నిలువెత్తు బంగారం, పసుపు, కుంకుమ, గాజులు, ఒడిబియం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నలుమూలల నుంచి దారులన్నీ చిన్నమేడారం వైపే సాగాయి.
భక్తులు కాలినడకన, ట్రాక్టర్లు, ఆటోలు, ప్రైవేట్ వాహనాల్లో అడవిబిడ్డల చెంతకు చేరడంతో చిన్నమేడారం భక్తజనంతో పోటెత్తింది.
ప్రభుత్వ విప్ పూజలు..
ఆలేరు రూరల్ : మండలంలోని చిన్నమేడారం జాతరకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి హాజరై పూజలు చేశారు. ఆమె వెంట ఆలయ వ్యవస్థాపకురాలు సబితారెడ్డి, సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్రెడ్డి, ఉప సర్పంచ్ మామిడాల అనిత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, ఆలయ డైరెక్టర్లు నారాయణరెడ్డి, శేషాద్రి, శ్రీధర్చారి, పద్మ, హన్మంతరావు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
నేడు గద్దెపైకి సమ్మక్క..
గురువారం బూర్గుపల్లి పులిగుట్ట వద్ద సమ్మక్కకు పూజలు చేసి అనంతరం గద్దెపైకి తీసుకురాన్నున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ నవీన్రెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్రెడ్డ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ చింతల అంజయ్య, ప్రధాన కార్యదర్శి చింతల సత్తయ్య, సర్పంచులు చింతల పరిమళ, మమత, గుంటి మధుసూదన్రెడ్డి, ఎంపీటీసీ కవిత పాల్గొన్నారు.