ఉదయం తిరు వేంకటపతి, సాయంత్రం
పరమవాసుదేవుడి అవతారాల్లో దర్శనం
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
శ్లోకం : ‘శ్రీమతృయోనిధినికేతన చక్రపాణే, భోగేంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే.. యోగీశ శాశ్వత శరణ్యభవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబం’
యాదాద్రి, మే 13 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, అనుబంధ ఆలయమైన పాతగుట్టలో స్వామి జయంత్యుత్సవాలను అర్చకులు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. గర్భాలయ ముఖ మండపంలో మంత్ర, వేద సౌష్టవంగా, కళాత్మకంగా ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం ప్రధానాలయాన్ని తెరిచిన అర్చకులు స్వామికి అభిషేకం, అర్చనలు చేశారు. ఉదయం 9.30గంటలకు ఆలయ మండపంలో స్వస్తీవాచనం, విశ్వక్సేనారాధన పూజ, పుణ్యాహవాచనం, రుత్విక్గ్వరణం, కుంకుమార్చన, రక్షాబంధనం వంటి కైంకర్యాలను చేపట్టారు. అనంతరం స్వామివారికి లక్ష పుష్పార్చన గావించారు. 11గంటలకు తిరు వేంకటపతి అలంకార సేవలో స్వామిని ఆలయంలో ఊరేగించారు. సాయంత్రం 6గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణ, హవనం వంటి కార్యక్రమాలను శాస్ర్తోక్తంగా చేశారు. అనంతరం గరుఢ వాహనంపై పరమవాసుదేవ అలంకారంలో స్వామిని ప్రధానాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. ఆయా పూజా కైంకర్యాల్లో ఆలయ ఈఓ ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనర్సింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాడూరి వెంకటాచార్యులు, చింతభట్ల రంగాచార్యులు, బట్టర్ సురేంద్రచార్యులు, శ్రీధరాచార్యులు, ఆలయ ఏఈఓలు దోర్భల భాస్కర్శర్మ, గజవెల్లి రమేశ్బాబు, పాతగుట్ట అర్చకులు కొడకండ్ల మాధవాచార్యులు, అర్చకబృందం పాల్గొన్నారు.
తిరువేంకటపతిగా నారసింహుడు..
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరువేంకటపతి అలంకార సేవలో భక్తకోటిని భగవానుడు అనుగ్రహించారు. ఉదయం 11గంటలకు తొలిసారిగా స్వామివారి స్వయంభూ ప్రధానాలయ మాఢవీధుల్లో ఘనంగా ఊరేగించారు. కలిలోని పాపాలను తొలగించుటకు వేంకటేశ్వర స్వామిగా ఏడుకొండలను ఆశ్రయించి భక్తకోటిని అనుగ్రహించిన తీరు ఈ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. ‘వేం’ అనగా పాపం అని ‘కటం’ అనగా తొలగించుట, ఆనందాన్ని కలిగించుట అని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. సర్వాంతర్యామి అయిన నర్సింహుడే వివిధ రూపాల్లో దర్శన భాగ్యం కల్పించి అనుగ్రహిస్తున్నాడని వేదాలు, ఉపనిశత్తులు తెలియజేస్తున్నాయని తెలిపారు.
సాయంకాలం కార్యక్రమాలు..
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయంలో నిత్య సామూహిక పారాయణం నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణల నడుమ నృసింహ జయంత్యుత్సవాల్లో భాగంగా సాయంత్రం 6గంటలకు అంకురారోపణం, హవనం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామిని పరమవాసుదేవుడా అలంకరించి గరుడ వాహనంపై ఊరేగించారు.