వైభవంగా సహస్ర ఘటాభిషేకం
పోటెత్తిన భక్తజనం
యాదాద్రి దివ్యక్షేత్రంలో మూడ్రోజులపాటు వైభవంగా సాగిన స్వామివారి జయంత్యుత్సవాలు నృసింహ ఆవిర్భావంతో పరిపూర్ణమయ్యాయి. ఉత్సవాల్లో చివరి రోజు ఆదివారం ఉదయం స్వామివారికి అభిషేకం, మహాపూర్ణాహుతి, సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. సాయంత్రం నృసింహ ఆవిర్భావ నివేదన చేపట్టారు. స్వాతి నక్షత్ర పూజలు జరిపించారు. సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి గిరి ప్రదక్షిణ చేశారు.
యాదాద్రి, మే 15 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో ఈ నెల 13న ప్రారంభమైన నృసింహుడి జయంత్యుత్సవాలు ఆదివారం రాత్రి పరిపూర్ణమయ్యాయి. ఉదయం 7గంటలకు స్వామికి అభిషేకం చేసి మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం స్వామికి సహస్ర ఘటాభిషేకం చేశా రు. తొలుత 1000 కళశాలను ఆలయ మహామండపంలో పేర్చి ప్రత్యేక పూజలు చేశారు. సాయం త్రం 7గంటలకు అర్చకులు నృసింహ జయంతి వేడుక జరిపించి, నృసింహ ఆవిర్భావ నివేదన, తీర్థ ప్రసాద గోష్టి చేపట్టి ఉత్సవాలకు ముగింపు పలికారు.
పాతగుట్ట లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో పూర్ణాహుతి, అష్టోత్తర సహస్ర ఘటాభిషేకం, నృసింహ జయంతి, ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా స్వాతి నక్షత్ర పూజలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున 4నుంచి 5.30గంటల వరకు భక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. ఆలయంలో మూడున్నర గంటల పాటు శ్రీవారి అష్టోత్తర సహస్ర ఘటాభిషేకం కనుల పండువగా జరిగింది. స్వామివారి నిత్యారాధనలు వైభవంగా నిర్వహించారు. స్వయంభువులను కొలిచిన అర్చకులు ప్రధానాలయంలో ఉత్సవమూర్తులను ఆరాధిస్తూ పంచామృతాలతో అభిషేకం చేశారు. రాత్రివేళలో స్వామిఅమ్మవార్లకు మహా నివేదన, శయనోత్సవం జరిపారు.