యాదాద్రి, ఫిబ్రవరి 14 : యాదాద్రీశుడిని కొండపై ప్రతి కట్టడం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. కొండపైకి బస్సుల ద్వారా వెళ్లే ప్రయాణికుల కోసం బస్బే, భద్రతను పర్యవేక్షించేందుకు పోలీస్ కంట్రోల్ రూం నిర్మాణ పనులు కొనసాగుతుండగా.. వాటిని కూడా అదే రీతిన తీర్చి దిద్దనున్నారు. బస్బే పక్కనే భారీ శంకు చక్ర తిరునామాలను ఏర్పాటు చేస్తున్నారు. కొండపైన ప్రతి కట్టడంపై స్వామివారి ప్రతిమలు, మండపాలు, ఐరావతాలు, గరుఢ ఆళ్వార్ల ప్రతిమలు, తోరణాలు, కాకతీయ పిల్లర్లు వంటి ఆకృతులతో తీర్చి దిద్దనున్నారు. వీటికి సంబంధించిన నమూనాలను సోమవారం వైటీడీఏ అధికారులు విడుదల చేశారు.
చకచకా బస్బే పనులు
సుమారు ఎకరంన్నర స్థలంలో నిర్మించే పనులు చకచకా సాగుతున్నాయి. మొత్తం 16 ప్లాట్ఫాంలు నిర్మిస్తున్నారు. ఇందులో 8 ప్లాట్ఫాంలు కొండ పైనుంచి వచ్చేందుకు, 8 ప్లాట్ఫాంలు కొండకిందికి వెళ్లే బస్సుల కోసం కేటాయించనున్నారు. బస్బేలో బస్సు దిగిన భక్తులు స్వామివారి దర్శించుకునేందుకు వెళ్లే క్యూ కాంప్లెక్స్కు ప్రత్యేకమైన దారిని ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు వికలాంగులు, వృద్ధులు, చిన్నారులు నడిచివేళ్లేందుకు ప్రత్యేకమైన రూఫ్వే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భక్తులు నిలబడేందుకు, ల్యాండ్ స్కేపింగ్లు, ఆ పక్కనే కారు పార్కింగ్కు ప్రత్యేకంగా రెండు ప్లాట్ఫాంలను నిర్మిస్తున్నారు. ఒక ప్లాట్ఫాంలో 22 కార్లు, మరో దానిలో 30 కార్లు పార్కింగ్ చేసే విధంగా నిర్మిస్తున్నారు.
భారీ శంఖు చక్ర తిరునామాలు
బస్బే పక్కనే భారీ శంకుచక్ర తిరునామాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా పిల్లర్లను నిర్మించారు. వీటిపై బిగించే శంకుచక్ర తిరునామాలు భక్తులను ఆకట్టుకుంటాయని వైటీడీఏ అధికారులు వెల్లడించారు.
పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం
బస్బే ఉత్తరభాగంలో అధునాతన పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని నిర్మిస్తుండగా.. పనులు పూర్తకావచ్చాయి. రాయగిరి, యాదాద్రి ఆలయం చుట్టూ ఉన్న సీసీ కెమెరాలతో పాటు భద్రతా వ్యవస్థను పర్యవేక్షించేందుకు ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని వినియోగించనున్నారు. ఇందులో 10×12 సైజ్లో ఎల్ఈడీ స్క్రీన్ బిగించి ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తారు. యాదాద్రి పరిసర ప్రాంతాల్లో జరిగే ఘటనలు, ఇతర ప్రమాదాలు వెంటనే కమాండ్ కంట్రోల్ కేంద్రానికి తెలిసే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు.